కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ను వణికిస్తోంది. రోజురోజుకూ విజృంభిస్తోంది. కరోనా టెస్టులు చేయడంలో ఆదర్శంగా నిలుస్తున్నా.. కేసులు మాత్రం అంతకు రెట్టింపు స్థాయిలో పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 46,61,355 టెస్టులు చేయగా.. 5,75,079 కేసులు నమోదయ్యాయి. అంటే.. ఆరు లక్షలకు చేరువలో ఉన్నాయి. దాదాపు ప్రతీ జిల్లానూ కరోనా అంటుకుంది. అయితే.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు.
Also Read: స్టాండ్ మార్చింది జగనా? చంద్రబాబా?
రాష్ట్రంలోకి కరోనా వచ్చిన ప్రారంభంలో కేసుల సంఖ్య తక్కువగానే ఉండేది. కొన్ని నెలల తరబడి అయితే.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో చాలా జిల్లాల్లో కూడా సంఖ్య జీరోగానే ఉండిపోయింది. రాష్ట్రంలోకి వైరస్ వచ్చిన మొదట్లో కేవలం మేజర్ నగరాలకే పరిమితమైంది. ఎప్పుడైతే మర్కజ్ మసీదు ప్రార్థనలు, కోయంబేడు మార్కెట్ ఇష్యూ మొదలైందో అప్పటి నుంచి జిల్లాలకు అంటుకుంది. వేలు దాటి లక్షకు చేరువవుతున్నాయి.
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే కేసులు 80 వేలకు చేరువలో ఉన్నాయి. దాదాపు 500 మంది వరకూ కరోనాతో మరణించారు. తొలినాళ్లలో బీభత్సం సృష్టించిన కర్నూలు జిల్లాలో నేడు 50 వేల కేసుల వరకూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోనూ కరోనా కేసులు 40 వేలకు పైగానే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి జగన్ కు మరో సవాల్
లాక్డౌన్ అమలులో ఉన్నన్ని రోజులు కఠిన నిబంధనలతో కరోనా వైరస్ కట్టడిలో ఉంది. కానీ.. ఎప్పుడైతే అన్లాక్ ప్రక్రియ మొదలైందో అప్పటి నుంచి సంఖ్య లక్షలకు లక్షలు పెరుగుతూనే ఉంది. అందుకే ఏపీలోని చాలా జిల్లాల్లో ఇప్పుడు కూడా లాక్డౌన్ను మళ్లీ అమలు చేస్తున్నారు. ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ను పాటిస్తున్నారు. ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకోకుండా.. ప్రజలే స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటున్నారు. అయినా కూడా ఏపీలో కరోనా నియంత్రణలోకి రాకపోవడంతో ఇక కంట్రోల్ తప్పినట్టేనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.