IPS Officer Corruption: ఐపీఎస్.. దేశంలో రెండో అత్యున్నత పదవి. ఇందుకోసం అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తారు. కొందరికి మూడో, నాలుగో ప్రయత్నంలో ఫలితం వస్తుంది. చాలా మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేరు. వివిధ దశల్లో పరీక్షలు ఉండడంతో ఏదో ఒక దశలో విఫలమవుతారు. అన్ని దశలు దాటుకుని వచ్చినవారే జాబ్ కొడతారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు ఎంతో ఆదర్శంగా సమాధానాలు ఇస్తున్న అభ్యర్థులు జాబ్లో జాయిన్ అయ్యాక అవినీతికి పాల్పడుతున్నారు. ఇటీవలే ఛత్తీస్గఢ్ క్యాడర్కు చెందిన రాహుల్ బన్సల్.. ఇంటర్వ్యూలో అవినీతికి వ్యతిరేకంగా సమాధానం ఇచ్చి దేశ యువతకు ఆదర్శంగా నిలిచాడు. కానీ ఇటీవలే కోటి రూపాయల లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన ఆదర్శ మహిళా పోలీస్ ఆఫీసర్ కూడా అవినీతికి పాల్పడి పరువు పోగొట్టుకుంది.
ఒకప్పుడు స్ఫూర్తిగా..
మధ్యప్రదేశ్లోని మహిళా పోలీసు అధికారి నేహా పచ్చీసియా జీవితం ఒకప్పుడు ప్రేరణగా నిలిచింది. విమాన సహాయకురాలిగా ఉన్న ఉద్యోగాన్ని వదిలి, కఠినమైన శిక్షణ, పోటీలు ఎదుర్కొని పోలీసు శాఖలో చేరింది. ఆ తర్వాత వివిధ జిల్లాల్లో సేవలు అందిస్తూ మంచి పనులతో గుర్తింపు పొందింది. ముఖ్యంగా మహిళల సమస్యల పరిష్కారానికి సులభమైన వ్యవస్థలు ఏర్పాటు చేసినందుకు ప్రశంసలు అందుకుంది. ఇలాంటి నేపథ్యం ఆమెను ‘ఆదర్శ అధికారి’గా చూపించింది.
సూపరింటెండెంట్ అయ్యాక..
కట్నీలో సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేహ తీరు మారింది. ఒక హత్య కేసులో నిందితుడి కుటుంబం నుంచి భారీ మొత్తం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, విలువైన భూమిని చాలా తక్కువ ధరకు అమ్మించేలా ఒత్తిడి తెచ్చినట్లు విచారణలో తేలింది. ఈ విషయాలు నిజమని రుజువైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ విధించి, ప్రత్యేక విచారణ బందం ఏర్పాటు చేసింది.
వ్యవస్థా లోపాలు..
ఈ సంఘటన పోలీసు శాఖలో అధికారం, అవకాశాలు ఎలా దుర్వినియోగం కావచ్చో చూపిస్తుంది. ప్రారంభంలో సేవా దృక్పథంతో పనిచేసిన అధికారి కూడా కాలక్రమేణా లంచం, ఒత్తిడి వంటి మార్గాల్లోకి జారిపోవడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతుంది. అధికారం చేతుల్లోకి వచ్చినప్పుడు నిఘా, జవాబుదారీతనం సరిగా లేకపోతే అవినీతి సులభంగా చోటు చేసుకుంటుంది. మహిళా అధికారులు సమాజంలో సానుకూలతలు సృష్టించుకుని ఒక్క సంఘటనే ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. ఉద్యోగం సాధించడం కష్టం, కానీ దాన్ని నిజాయితీగా కొనసాగించడం అంతకంటే కష్టం. వ్యక్తిగత లాభం కోసం అధికారాన్ని ఉపయోగించడం చివరికి అవమానం, ఉద్యోగ నష్టం, చట్టపరమైన చర్యలకు దారితీస్తుంది.
ఇలాంటి కేసులు పోలీసు శాఖలో మరింత కఠినమైన నిఘా వ్యవస్థ, ఆస్తి లెక్కల తనిఖీ, ఫిర్యాదులపై వేగవంతమైన చర్యలు అవసరమని చెబుతున్నాయి. ప్రభుత్వం సస్పెన్షన్, విచారణ ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఆదర్శంగా మొదలైన ప్రయాణం అవినీతి వైపు మళ్లితే, సమాజం నమ్మకం కోల్పోతుంది. నేహ పచ్చీసియా కథ ఒక హెచ్చరిక.