spot_img
Homeజాతీయ వార్తలుSengol History: రాజదండం వచ్చింది తమిళనాడు నుంచే.. కానీ తయారు చేసింది మన తెలుగు వాళ్ళు.....

Sengol History: రాజదండం వచ్చింది తమిళనాడు నుంచే.. కానీ తయారు చేసింది మన తెలుగు వాళ్ళు.. సెంగోల్‌ వెనుక ఆసక్తికరమైన కథ

Sengol History: సాధారణంగా మనం గృహప్రవేశం చేస్తున్నప్పుడు పాలకోయ జాతికి చెందిన చెట్టు కర్రతో యంత్రాన్ని దిగువ మూలన ప్రతిష్టించడం ఆనవాయితీ. దీనివల్ల ఇంటికి ఏమైనా అరిష్టాలు వస్తే వాటిని ఆ యంత్రం తొలగిస్తుందని ఒక నమ్మకం. ఇప్పుడు దేశానికి సంబంధించి నిర్మించిన పార్లమెంటు భవనానికి కూడా ఎలాంటి అరిష్టాలు రాకుండా ఉండేందుకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మే 28న రాజ దండాన్ని ప్రతిష్టించారు. అయితే దానికి ఏళ్ల నాటి చరిత్ర ఉంది. 1947లో బ్రిటిషర్లు మనకు స్వాతంత్రం ప్రకటించి భారతదేశాన్ని విడిచి వెళ్లిపోయే ముందు అధికార మార్పిడికి గుర్తుగా దేశ తొలి ప్రధాని నెహ్రూకు రాజదండం ఇచ్చారు. ఇది ఇన్నాళ్లుగా అలహాబాద్ లోని పురావస్తు ప్రదర్శనశాలలో ఉంది. దానిని ప్రధానమంత్రి మే 28న కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్టించారు. భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన తర్వాత నాటి వైస్రాయ్ మౌంట్ బాటెన్ ” బ్రిటిషర్ల నుంచి భారతీయుల చేతుల్లోకి అధికార మార్పిడి జరుగుతోంది కదా? దానికి గుర్తుగా ఎలాంటి కార్యక్రమం చేద్దామనుకుంటున్నారు” అని నెహ్రూను అడిగారు.. దీనిపై చక్రవర్తుల రాజగోపాలాచారి ( రాజాజీ) కొంత పరిశోధన చేసి అధికార మార్పిడికి సంబంధించి చోళ రాజులు పాటించిన విధానాన్ని ఎంచుకున్నారు. చోళుల్లో ఒక రాజు నుంచి మరొక రాజుకు అధికార మార్పిడి జరిగినప్పుడు రాజదండాన్ని కొత్త రాజుకు బహుకరిస్తారు. దీంతో ఆయన మద్రాసులో అప్పటికి ప్రముఖ నగల వర్తకులైన “ఉమ్మిడి బంగారు శెట్టి అండ్ సన్స్” కు దండాన్ని తయారు చేసే బాధ్యత అప్పగించారు. దాన్ని తయారుచేసిన ఉమ్మిడి ఎత్తి రాజులు, సుధాకర్ ఇప్పటికీ చెన్నైలో నిర్వహిస్తున్నారు. ఐదు అడుగుల ఎత్తుకుంటే ఈ బంగారు పూత పూసిన వెండి దండం పైన పవిత్రతకు, న్యాయానికి గుర్తుగా నంది ప్రతిమను వారు చెక్కారు.

తెలుగు వంశీకులే.

నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా సభాపతి స్థానం పక్కనే ప్రతిష్ఠితమైన ‘రాజదండం’ (సెంగోల్‌) ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాల విమర్శల సంగతెలా ఉన్నా, రాజసాన్ని తలిపించేలా ఉన్న ఈ రాజదండాన్ని తయారు చేసింది తెలుగువంశీకులే కావడం విశేషం. కానీ యావద్దేశం ఈ రాజదండం తమిళనాడు నుంచి వచ్చిందని చెబుతుందేగానీ, తెలుగుజాతీయుడు దీనిని తయారు చేశాడన్న విషయాన్ని విస్మరించడం బాధాకరం. ఈ రాజదండం ప్రతిష్ఠాపన సందర్భంగా ఉమ్మిడి బంగారు చెట్టి వంశీకులను ప్రధాని మోదీ తన ఇంటికి ఆహ్వానించారు. ఆయన కూడా ‘వణక్కం..’ అంటూ వారందరినీ పలుకరించి, ఆదరించారేతప్ప, తెలుగువారన్న సంగతిని గ్రహించలేకపోయారు. ఆఖరికి మీడియాలోనూ బంగారు చెట్టి కుటుంబానికి సంబంధించి, ఆయన వారసులకు సంబంధించి పొంతనలేని సమాచారమే హల్‌చల్‌ చేస్తోంది. ఉమ్మిడి బంగారుచెట్టిది ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన వేలూరు జిల్లా గుడియాత్తం. అక్కడినుంచి ఆయన కుటుంబం 123 ఏళ్ల క్రితమే మద్రాసు పట్టణం వలస వెళ్లింది. బంగారం వ్యాపారం నిమిత్తం మద్రాసులో అడుగుపెట్టిన బంగారు చెట్టి.. అదేఏడాది జార్జ్‌టౌన్‌లో ఉన్న గోవిందప్పనాయకన్‌ వీధిలో చిన్నషాపు పెట్టారు. ఆ తరువాత దాని వెనుకభాగంలో ఆభరణాల తయారీ కోసం ఓ ఫ్యాక్టరీ పెట్టారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీలో నగల తయారీ కోసం ఏర్పాటైన మొట్టమొదటి ఫ్యాక్టరీ అదే. బంగారు చెట్టికి ముగ్గురు కుమారులు. శ్రీరాములు చెట్టి, ఆంజనేయులు చెట్టి, అనంతం చెట్టి. ఆంజనేయులు చెట్టికి ఆరుగురు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు యతిరాజులు (96). మోదీ రాజదండం చేతితో పట్టుకునే సందర్భంగా ప్రత్యేకంగా అభినందించింది యతిరాజులునే. ప్రస్తుతం బంగారు చెట్టి వంశీకుల్లో ఐదవతరం వారు బంగారు వ్యాపారం చేస్తున్నారు. తెలుగేతర ప్రాంతంలో వున్నా ఉమ్మిడి వంశంలో ఇప్పటికీ తెలుగు సంప్రదాయాలే కొనసాగడం విశేషం. ఇప్పటికీ ఆయా గృహాల్లో కుటుంబీకులు తెలుగే మాట్లాడతారు. బంగారు చెట్టి మనవళ్లు, మునిమనవళ్లు, వారి పిల్లలు సహా దాదాపు అందరూ ‘చదవగలిగేంత తెలుగు నేర్చుకోవడం’ అన్నింటికన్నా విశేషం.

ఇదీ ఆ రాజదండం కథ

బంగారు పోత పోసిన వెండి రాజదండం లోపలి భాగంలో కర్ర కూడా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. తిరువావడుదరై ఆధీనం పెద్దల కోరికపై రాజదండాన్ని బంగారుచెట్టి తయారుచేసినట్టు ఆయన మనవళ్లలో ఒకరైన ఉమ్మిడి సుధాకర్‌ చెబుతున్నారు. తమ తాత బంగారు చెట్టి రూపొందించిన రాజదండం ఈ తరానికి కూడా ఉపయోగపడడం గర్వంగా ఉందన్నారు. ‘‘పార్లమెంటు ప్రారంభోత్సవ ఆహ్వానం మేరకు వెళ్లిన మా అన్నదమ్ములు, కుమారులు, మనవళ్లు, మునిమనవళ్లకు ప్రత్యేకంగా ప్రధాని తేనీటి విందు కోసం ఇంటికి ఆహ్వానించారు. ఎంతో అభిమానంగా పలకరించారు’’ అని సుధాకర్‌ పేర్కొన్నారు. కాగా రాజదండం తెలుగు తెలుగు వంశీకులు తయారు చేయడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అంతటి నూతన పార్లమెంట్లో సభాపతి స్థానం పక్కన రాజదండం కొలువు దీరడాన్ని వారు స్వాగతిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ టాపిక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular