నేటి రాత్రితో ముగియనున్న మూడు వారల లాక్డౌన్ ను మరో 19 రోజుల పాటు, మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం ప్రకటించారు. ప్రధాని మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మే 20 తర్వాత దశల వారిగా సడలింపగలమని చెప్పారు. అయితే సడలింపు ఏ విధంగా ఉంటుందో మాత్రం వివరించలేదు. అయితే మార్గదర్శక సూత్రాలను రేపు ప్రకటిస్తామని చెప్పారు.
వచ్చే వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు మాత్రం మరింత కఠినంగా ఉండగలదని సంకేతం ఇచ్చారు. ఏ విధంగా అమలు చేశారో అన్నదానిని బట్టి సడలింపు ఉండవచ్చనే అభిప్రాయం కలిగించారు. దేశం అంతటా ఎవ్వరెవ్వరు, ఎక్కడెక్కడ, ఏ విధంగా దీనిని అమలు పరుస్తున్నారో కేంద్రం ఒక కంట సునిశితంగా గమనిస్తూనే ఉంటుంది సుమా అంటూ సున్నితంగా హెచ్చరించారు.
ప్రతి రాష్ట్రంలో, జిల్లాల్లో, ప్రాంతంలో, ఆసుపత్రిలో ఏ విధంగా అమలు చేస్తున్నారేమో కేంద్రం సునిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. చాలా ముందుగా కరోనా ఆకట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని పేర్కొంటూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకముందే స్క్రీనింగ్ ప్రారంభించామని, పాజిటివ్ కేయూస్లు 500 కు చేరుకోక ముందే లాక్డౌన్ ప్రకటించామని ప్రధాని గుర్తు చేశారు.
ఇప్పటి వరకు దేశ ప్రజలు లాక్డౌన్ అమలు కోసం సహకరించినందుకు శిరసు వంచి నమస్కరిస్తున్నానంటూ ప్రధాని మోదీ తెలిపారు. దేశం కోసం ప్రజలు సైనికుల్లా పనిచేస్తున్నారు. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని కొనియాడారు.
కరోనాపై భారత్ బలంగా పోరాడుతోంది. ప్రజలు ఎన్నో కష్టాలు పడి భారత్ను రక్షించారు. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఒక్కతాటిపై ఉంది. అందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలని ప్రధాని తెలిపారు.
‘‘కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం కరోనా కట్టడిలో ముందుంది. 21 రోజుల లాక్డౌన్ను దేశం సమర్థంగా అమలు చేసింది. ఇతర దేశాల్లో మన కంటే 20, 30 శాతం ఎక్కువ కేసులు ఉన్నాయి…’’ అని ప్రధాని వివరించారు.