Homeజాతీయ వార్తలుBandi Sanjay: బీజేపీ స్కెచ్‌ మామూలుగా లేదుగా.. బండి సంజయ్‌కి హెలికాప్టర్‌..!

Bandi Sanjay: బీజేపీ స్కెచ్‌ మామూలుగా లేదుగా.. బండి సంజయ్‌కి హెలికాప్టర్‌..!

Bandi Sanjay: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటి వరకు అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నిన్నటి వరకు రేసు నుంచి తప్పుకున్నట్లే కనిపించిన బీజేపీ కూడా స్పీడ్‌ పెంచాలనుకుంటోంది. మొన్నటి వరకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య అవగాహన కుదిరిందన్నట్లు వ్యవహరించిన రెండు పార్టీలు కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేశాయి. కానీ, రెండు రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ బీజేపీ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదుని, మోదీ తెలంగాణ నుంచే ఎక్కువ తీసుకున్నాడని, తెలంగాణకు ఇచ్చింది తక్కువే అని ఆరోపిస్తున్నారు. దీంతో బీజేపీ కూడా వ్యూహం మార్చింది. దూకుడు పెంచాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్‌ను పోటీకి దింపి బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటి కాదని సంకేతం ఇచ్చిన కవననాథులు ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం అందివచ్చే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది.

‘బండి’కి కీలక బాధ్యతలు..
బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఇటీవల అమిత్‌షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కు కీలక ప్రచార బాధ్యతలను అప్పగించింది. సంజయ్‌తో వీలైనంత ఎక్కువ ప్రచారం చేయించాలని కమలనాథులు భావిస్తున్నారు. కేసీఆర్‌కు ధీటుగా మాట్లాడే నేతగా సంజయ్‌ ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో గుర్తింపు పొందారు. దీంతో సంజయ్‌తో ప్రచారంలో దూకుడు పెంచేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగానే సంజయ్‌ ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకత్వం హెలికాప్టర్‌ను కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన సేవలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఓ వైపు బండి సంజయ్‌తో ప్రచారం చేయిస్తూనే.. ఇంకోవైపు కేంద్ర మంత్రి తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ సహా పలువురు బీజేపీ నేతలకు కూడా ప్రచారా బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం.

కరీంనగర్‌ బరిలో సంజయ్‌..
ఇదిలా ఉండగా, బండి సంజయ్‌ ఈ ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఓవైపు తన నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా హెలికాప్టర్‌లో పర్యటించనున్నారు. ప్రతీరోజు ఉదయం 11 గంటల వరకు తన నియోజకవర్గంలో ప్రచారం కొనసాగించనున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. త్వరలో ఈయన ప్రచారం చేసే నియోజవర్గాల జాబితాను బీజేపీ విడుదల చేయనుంది. మరోవైపు అటు బండి సంజయ్‌తోపాటు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ సహా పలువురు కేంద్ర నాయకుల ప్రచారం కోసం బీజేపీ అధిష్టానం మరో రెండు హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.

రేపు మూడో జాబితా..
ఇదిలా ఉంటే, ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై 52 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ స్థానాన్ని ఒకటే రెండో జాబితాలో ప్రకటించారు. మిగిలిన 66 స్థానాలకు లిస్ట్‌ను రేపు(నవంబర్‌ 1న) విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం అభ్యర్థులు ప్రకటించిన వెంటనే బండి సంజయ్‌తోపాటు ఇతర నేతలు ప్రచారరంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular