EPFO
EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోని చందాదారులకు గరిష్ట వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచేందకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్మిక సంఘాలు, అనుబంధ సంస్థలు ఇందుకోసం గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో వేతన పరిమితి పెంపుతో జరిగే పరిణామాలపై కేంద్ర కార్మిక శాఖ ప్రాథమిక కసరత్తు చేసింది.
ప్రస్తుతం రూ.15 వేలే..
ప్రస్తుతం ఈపీఎఫ్ చందాదారుడి గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. 2014కు ముందు ఇది కేవలం రూ.6,500 కాగా, అప్పటి ప్రభుత్వం ఈ పరిమితిని రూ.15 వేలకు పెంచింది. ఈపీఎఫ్వో ఫార్ములా ప్రకారం ఒక ఉద్యోగి భవిష్యనిధి చందా కింద 12 శాతం యాజమాన్యం చెల్లిస్తుండగా, మరో 12 శాతం ఉద్యోగి వేతనం నుంచి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని (పెన్షన్ మినహా) ఉద్యోగి విరమణ సమయంలో వడ్డీతో సహా ఈపీఎఫ్వో తిరిగి చెల్లిస్తుంది.
ఉద్యోగికి లాభం.. యాజమాన్యాలకు భారం..
చందాదారుడి గరిష్ట వేతన పరిమితి పెంపుతో ఉద్యోగికి లాభం కలుగనుంది. అదే సమయంలో అధిక చెల్లింపుల భారం యాజమాన్యాలపై పడనుంది. ప్రస్తుత ఫార్ములా ప్రకారం గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలు ఉండగా, అందులో 12 శాతం అంటే రూ.1800 యాజమాన్యం, సదరు ఉద్యోగి ఈపీఎఫ్వో ఖాతాకు బదిలీ చేస్తోంది. ఇందులో నుంచి 8.33 శాతం(రూ.1250) పెన్షన్ ఖాతాకు బదిలీ అవుతుంది. మిగతా 3.67 శాతం (రూ.550) మొత్తం భవిష్యనిధి ఖాతాలో జమవుతుంది. దీనికి సమానంగా ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం (రూ.1800) భవిష్యనిధి ఖాతాలో జమ చేస్తారు.
వేతన పరిమితి పెరిగితే ఇలా…
ఇక కేంద్రం వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచితే ఇందులో 12 శాతం(రూ.2,520) యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈలెక్కన ఉద్యోగి పెన్షన్ ఖాతాలో రూ.1,790, భవిష్య నిధి ఖాతాలోకి రూ.730 జమ అవుతాయి. ఉద్యోగి వేతనం నుంచి కూడా 12 శాతం అంటే రూ.2,520 భవిష్య నిధి ఖాతాలో జమ చేస్తారు.
ఈఎస్ఐ పరిమితి రూ.21 వేలు..
ప్రస్తుతం ఈఎస్ఐ చట్టం కింద చందాదారుడి గరిష్ట వేతన పరిమితి రూ.21 వేలుగా ఉంది. రూ.21 వేలు దాటిన వారు ఈఎస్ఐ పరిధిలోకి రారు. ఈఎస్ఐ గరిష్ట వేతన పరిమితి 2016కు ముందు రూ.15 వేలు ఉండగా, కేంద్రం దీనిని రూ.21 వేలకు పెంచింది. ఈ తరహాలోనే ఈపీఎఫ్వో కూడా వేతన పరిమితి రూ.21 వేలకు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Good news for epfo subscribers salary limit increase
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com