తెలంగాణలో కరోనా కట్టడికి పోలీసులు సాంకేతికను వినియోగిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవున్న ఏరియాల్లో డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని కట్టడి చేయనున్నారు. డ్రోన్ల సాంకేతికను వినియోగించుకునేందుకు రాచకొండ పోలీసులు శ్రీకారం చుట్టారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న బాలాపూర్, పహడీషరీఫ్, మౌలాలి ప్రాంతాల్లో డ్రోన్ల నిఘా ఉంచుతున్నారు. ఈమేరకు సైయంట్ కంపెనీ సహకారంతో రెండు డ్రోన్ కెమెరాలను సోమవారం సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి పోలీసులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారని తెలిపారు. కరోనా కట్టడికి అవసరమైన సాంకేతికతను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీటి ద్వారా కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాల్లో జనాల రద్దీ ఎలా ఉంది..? భౌతిక దూరం పాటిస్తున్నారా..? లేదా? కర్ఫ్యూ సమయంలో మెడికల్ దుకాణాలు పని చేస్తున్నాయా..? వ్యాపార సముదాయాలకు అనుమతి లేకున్నా తెరిచి ఉంటే డ్రోన్ కెమెరాలతో తెలుసుకోవచ్చన్నారు. ఈ సాంకేతికతను ఉపయోగించుకొని లాక్డౌన్ సమర్థవంతంగా నిర్వహించవచ్చని సీపీ వివరించారు.
ఈ డ్రోన్ల సహాయంతో ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సూచనలు అందించవచ్చన్నారు. సరైన నిర్ణయాలను త్వరగా అమలు చేసేందుకు వీలుంటుందని సీపీ మహేష్ భగవత్ అన్నారు. డ్రోన్ కెమెరాలు ఫొటోలతోపాటు వీడియోలు తీసీ రాచకొండ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు పంపిస్తాయని తెలిపారు. వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లో బహిరంగ ప్రకటనలు కూడా చేయవచ్చని ఆయన వివరించారు. రాచకొండ పోలీసులు చేస్తున్న వినూత్న ఆలోచనను పలువురు ప్రశంసిస్తున్నారు. రాచకొండ పోలీసులు దారిలోనే మరిన్ని కమిషనరేట్లు నడిచేలా కన్పిస్తున్నారు.