కరోనాను కట్టడి చేసేందుకు ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెడుతానన్నసీఎం కేసీఆర్… ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కట్ చేస్తున్నారని బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి డి కె అరుణ ప్రశ్నించారు.
ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడు ఆర్థిక లోటు అనటం విడ్డురంగా ఉందని అరుణ ధ్వజమెత్తారు. కేవలం వారం రోజులు లిక్కర్ షాపులు బంద్ చేస్తే రాష్ట్రంలో ఆర్థిక లోటు వచ్చిందా అని ప్రశ్నించారు. వారం రోజుల లాక్ డౌన్ కే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా…ఇక ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదని, మరి వాటిని ఎలా ఎదుర్కొంటారని ఆమె దుయ్యబట్టారు.
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సగం మేర కొత్త విధించాలని కేసీర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు భయబ్రాంతులకు గురవుతున్నారని అరుణ విమర్శించారు. అసలు రాష్ట్రంలో ఇలాంటి ఆర్ధిక పరిస్థితి రావడానికి మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆరోపించారు.
ప్రతి రోజు పోరాడుతున్న ఉద్యోగులకు మీరిచ్చే బహుమానం ఇదేనా అని ఆమె నిలదీశారు. నెల జీతంపై ఆధారపడి బతికే ఉద్యోగుల వేతనాల్లో ఏక పక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.