భూమి కోసం.. భుక్తి కోసం.. బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం.. అంటూ పోరాటాలు సాగించిన కామ్రేడ్స్ ఇమేజీ కాస్త రోజురోజుకూ మసకబారుతోందా..? రాష్ట్రంలో ఎలాంటి స్టంట్ తీసుకోవాలో తెలియకుండా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారా..? ప్రభుత్వంపై ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నేతలు ప్రభుత్వానికి ఎందుకు అనుకూలంగా మారుతున్నారు..? పోరాడే సత్తా వారిలో తగ్గిందా..? ప్రజా సమస్యలు వారికి కనిపించడం లేదు..? లేదా ప్రజలకు సమస్యలు ఏమీ లేవనే అభిప్రాయానికి వచ్చారా..? ఇప్పుడు కామ్రేడ్స్ వైఖరి చూస్తుంటే ప్రతి ఒక్కరి మదిలోనూ ఇవే ప్రశ్నలు మెదులుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక ఆనివార్యమైంది. దీంతో ఇప్పుడు ఈ ఉప ఎన్నిక పోరు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో పోలింగ్ కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో అన్నిపార్టీలూ అక్కడ పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు పోటీపోటాగా విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ముఖ్య పార్టీల అగ్రనేతలందరూ అక్కడే మకాం వేశారు. ఈ సీటును తమ ఖాతాలో అంటే తమ ఖాతాలో వేసుకోవాలని పార్టీలు ఉవ్విల్లూరుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర శాఖ ఊహించని నిర్ణయం తీసుకొని అందరినీ విస్మయపరిచింది. కామ్రేడ్లు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాల్సింది పోయి.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ ప్రకటించి అందరినీ ఆలోచనలో పడేసింది. ఓ వైపు.. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సీపీఐ లీడర్లు.. సీపీఎం తీసుకున్న నిర్ణయంతో ఏం మాట్లాడాలో తెలియకుండా మిన్నకుండిపోయారు.
ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్కు సీపీఎం నేతలు మద్దతు ప్రకటించడంతో ఇప్పుడు అధికార పక్షంలో జోష్ కనిపిస్తోంది. చెప్పాలంటే నోముల నరసింహయ్య ముందు నుంచీ కామ్రేడ్. సో.. ఆయన కుమారుడైన నోముల భగత్ ఇప్పుడు అధికార పక్షం తరఫున బరిలో నిలిచారు. దీంతో సీపీఐ(ఎం) నాయకులు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. భగత్ విజయం కోసం తాము కృషి చేస్తామని వారు ప్రకటించారు.