భారత దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతూ ఉండడంతో పాటు, కరోనా మహమ్మారి నుండి రోగులు సహితం క్రమంగా కోలుకొంటున్న సందర్భంలో ఒక సారి ఈ వైరస్ సోకిన వారికి మళ్ళి సోకక పోవడం ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది.
దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా మెరుగుపడుతోందని కేంద్రం తెలిపింది. రికవరీ రేటు 22.71శాతంగా ఉందని ప్రకటించింది.
కరోనా సోకి కోలుకున్న వారి నుంచి కరోనా తిరిగి వ్యాప్తి చెందడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. అంతేకాదు కరోనా నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను డొనేట్ చేసి ఇతరులను కాపాడాలని, ఇందులో మరే సందేహాలు పెట్టుకోనవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.
చైనా వూహాన్తో పాటు అనేక ఐరోపా దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి మళ్లీ మళ్ళి సోకుతూ ఉండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారినుంచి ఇప్పట్లో కోలుకోలేమనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ప్రపంచ దేశాల పరిస్థితులకు భిన్నంగా భారత్లో కరోనా సోకి కోలుకున్న వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని కేంద్రం స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇలా ఉండగా, గత 24 గంటల్లో కొత్తగా 1396 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో.. భారత్లో మొత్తం కరోనా నిర్ధారిత పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కు చేరింది.
భారత్లో ప్రస్తుతం 20,835 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఒక్కరోజులో 381 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.