Congress- Munugode by-Election: మునుగోడు ముప్పు రానుంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక ఖాయమనే తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉప ఎన్నికలో విజయం కోసం స్ట్రాటజీ అండ్ క్యాంపెయిన్ కమిటీని ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మధు యాష్కీ గౌడ్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది. సభ్యులుగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అనిల్ కుమార్ లను చేర్చింది.
మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలనే తపనతోనే అన్ని పార్టీలు అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ఎన్నికలో గెలిచిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో మనుగడ ఉంటుందని భావించి మూడు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మునుగోడులో సత్తా చాటి రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అని చాటాలని బీజేపీ సిద్ధంగా ఉంది. అదే సమయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా తగ్గేదేలే అని చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సాధారణ ఎన్నికలకంటే ముందే రాజకీయ వేడి రగులుకుంటోంది.
Also Read: Chandrababu Delhi Tour: చంద్రబాబు వ్యూహం మారిందా? ఢిల్లీ టూర్ ఆసక్తికరం
రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇంతవరకు ఆయన ఏ పార్టీలో చేరుతున్నానని ప్రకటించలేదు. దీంతో అందరిలో టెన్షన్ పట్టుకుంది.
ఆయన ఏ పార్టీలో చేరతారు? ఏ పార్టీ కండువా కప్పుకుంటారనేది సందేహాత్మకంగా ఉంది. బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఆయనలోని అంతరంగమేమిటన్నది ఇంకా ఎవరికి తెలియదు. దానికి తోడు ఆయన కూడా ఫలానా పార్టీలో చేరతానని ఇంతవరకు తెలియజేయలేదు. కానీ బీజేపీలోనే చేరతారనే విశ్వాసం అందరిలో వస్తోంది.
మునుగోడులో ఎవరు మునుగుతారో ఎవరు తేలుతారో తెలియడం లేదు. రాజకీయం మాత్రం రంజుగా మారుతోంది. మునుగోడు ఉప ఎన్నిక మొత్తం దేశం దృష్టినే ఆకర్షించనుంది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీ ఎంతగా పోరాడినా ఫలితం దక్కకుండా పోవడం తెలిసిందే. ఈ ఉప ఎన్నిక కూడా అధికార పార్టీకి సవాలుగానే మారనుంది.
మరోవైపు కాంగ్రెస్ కూడా సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడో స్థానానికి పోతే ఓటర్లలో పరువు పోతుందనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో ఉంది.
రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో అంతుచిక్కడం లేదు. బీజేపీలోనే చేరతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఆయన కూడా ఏ ప్రకటన చేయడం లేదు. దీంతోనే అందరిలో అనుమానాలు వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక రాబోయే ఎన్నికలకు రెఫరెండంగా భావించి మూడు పార్టీలు విజయం దక్కించుకోవాలని తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమ పరువును నిలబెట్టుకోవాలని చూస్తున్నాయి. ఏ పార్టీ విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే మరి.
కాంగ్రెస్ పార్టీకి మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దనే ఉద్దేశంతో ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా అక్కడ గెలవడం అంత సులభం కాదని తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మునుగోడులో ఉప ఎన్నిక పార్టీని ముంచుతుందో లేక తేల్చుతుందో అంతుచిక్కడం లేదు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More