Jagan Polavaram Tour: ఏపీ సీఎం జగన్ వస్తున్నారంటే షెడ్యూల్ ఖరారు కాక మునుపే ప్రజలకు తెలిసిపోతోంది. ఆయన వస్తున్నారంటే హడావుడి మామ్మూలుగా ఉండదు. రోడ్డపై బారికేడ్లు పెట్టి బ్లాక్ చేస్తారు. షాపులను బలవంతంగా మూయిస్తారు. పర్యటన రోజు జనాలను పూర్తిగా నియంత్రిస్తారు. సీఎం కాన్వాయ్ బయటకు కనిపించకుండా పరదాలు కట్టేస్తారు. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలకు నరకం చూపిస్తారు. పచ్చని చెట్లను తొలగిస్తారు. డివైడర్లను ధ్వంసం చేస్తారు. నాలుగేళ్లలో ఇది నిత్యకృత్యం. కానీ గత కొద్దినెలలుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తున్న జగన్ ఏపీ ప్రజలకు నరకం చూపిస్తున్నారు.
విపక్షంలో ఉన్నప్పుడు జనమే ముద్దన్న జగన్.. అధికారంలోకి వచ్చాక తీరు మార్చుకున్నారు. తనను తాను ఓ రేంజ్ చక్రవర్తిలా భావించుకుంటున్నారు. ఏ సీఎం అయినా ప్రజల్లో వెళ్లేందుకు భయపడరు. కానీ జగన్ తీరు అందుకు భిన్నం. తనను కలిసేందుకు వచ్చే జనాలను కలవరు. వచ్చిన వాళ్లూ కలవలేరు. కానీ మళ్లీ ఎన్నికలు వస్తున్న సమయంలో ఆయనకు ప్రజల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. నాలుగేళ్ల కాలంలో మొత్తం అస్తవ్యస్త పాలన కారణంగా సొంత పార్టీ క్యాడర్ మాత్రమే కాదు.. అన్ని వర్గాలూ అసంతృప్తిగా ఉన్నాయి. వారిని సంతృప్తి పరిచేందుకు ఏదో ఒకటి చేయాల్సి ఉంది. అఅందుకే బటన్ నొక్కేందుకు జిల్లాల బాట పడుతున్నారు. ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారు.
జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రముఖులు స్వేచ్ఛగా పర్యటనలు సాగిస్తున్నారు. కానీ జగన్ మాత్రం అలా కాదు. చివరకు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో చంద్రబాబు, ఇతర విఐపీలు పర్యటించారు. కానీ వారి పర్యటనల పేరుతో రోడ్డుపై ఉన్న చెట్లను నరికివేయలేదు. దుకాణాలను మూసివేయించలేదు. ఇక రోడ్లకు బారికేడ్లు, పరదాలు కట్టలేదు. ఇవన్నీ జగన్ హయాంలోనే జరుగుతున్నాయి. జగన్ తాడేపల్లి నుంచి ఎక్కడికి వెళ్లినా గన్నవరం నుంచి ప్రత్యేక విమానం లేదా హెలికాప్టర్లో వెళ్తారు. హెలిప్యాడ్ నుంచి సభావేదిక లేదా కార్యక్రమం జరిగే ప్రాంతానికి వెళ్లడానికి రోడ్డు మార్గంలో కాన్వాయ్ వాడుతారు.
గత ఏడాదిన్నరగా జగన్ జనంలోకి వెళ్తారని చెబుతున్నారు. జిల్లాల పర్యటనలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. పదిహేను రోజులు జిల్లాల పర్యటనలోనే ఉంటారని కూడా ప్రకటనలు చేశారు. కానీ ఏదీ సరిగ్గా వర్కవుట్ కావడం లేదు. జిల్లాలు, గ్రామాల పర్యటనకు వెళ్తే పరదాలతో పని కానిచ్చేస్తే ప్రయోజనం ఉండదు. ప్రజలతో మాట్లాడాలి. అలా మాట్లాడటంవల్లే ఎక్కువ సమస్యలు వస్తాయని ఐ ప్యాక్ గుర్తించింది. అందుకే నేరుగా ఎన్నికల ప్రచారానికి సిద్ధపడుతున్నారు. అందుకు బటన్ నొక్కుడు కార్యక్రమాలను వినియోగించుకుంటున్నారు. పరదాలు, చెట్లు నరికివేత, డివైడర్ల ధ్వంసం ఇలా చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. ప్రజా జీవితానికి విఘాతం కల్పిస్తున్నారు.