Homeఆంధ్రప్రదేశ్‌Balineni Srinivasa Reddy: బాలినేనిని ఏకాకి చేసిన జగన్

Balineni Srinivasa Reddy: బాలినేనిని ఏకాకి చేసిన జగన్

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని పయనమెటు? వైసీపీలో సర్దుకుపోవాల్సిందేనా? లేకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. బాలినేనిని హై కమాండ్ అచేతనం చేసిందని ప్రచారం జరుగుతోంది. గత కొద్దిరోజులుగా నిత్య అసమ్మతి వాదిగా మారిన బాలినేని విషయంలో.. జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నట్టే చేసి.. నిర్వీర్యం చేసేలా వ్యవహరించారని టాక్ నడుస్తోంది. ఒకప్పుడు ఒంటి చేత్తో ప్రకాశం రాజకీయాలు నడిపిన ఆయన.. ఇప్పుడు పార్టీలో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ప్రత్యామ్నాయ అవకాశాలు లేక.. వేరే గత్యంతరం లేక.. ఆయన పార్టీలో కొనసాగే అనివార్య పరిస్థితులు కల్పించారని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైసిపి ఆవిర్భవించిన తర్వాత మంత్రి పదవి ఉన్నా.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి లెక్క చేయలేదు. జగన్ వెంట అడుగులు వేశారు. అందుకే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తన క్యాబినెట్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. తొలి మూడు సంవత్సరాలు వీర విధేయుడుగా ఉన్న బాలినేని ఓ రేంజ్ లో రాజకీయాల నడిపారు. ఒంగోలు జిల్లాను తన కనుసన్నల్లోకి తెచ్చుకున్నారు. కానీ మంత్రివర్గ విస్తరణలో మాత్రం బాలినేనిని తొలగించారు. అదే జిల్లాకు చెందిన ఆదిమూలం సురేష్ ను కొనసాగించారు. అప్పటి నుంచి బాలినేని తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. అయినదానికి, కాని దానికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ జగన్ కు చికాకు తెచ్చి పెట్టారు. అప్పటినుంచి పక్కన పెట్టడం ప్రారంభించారు. ఒకవైపు బుజ్జగిస్తూనే.. మరోవైపు నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకాశం జిల్లాలో ఏకాకిని చేశారు.

ఇప్పటికే బాలినేని జిల్లా పార్టీపై పట్టు కోల్పోయారు. వ్యూహాత్మకంగా నాయకత్వం ఆయనను డీగ్రేడ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పగించింది. ఈ పరిణామాలతో బాలినేని మరింత ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో తన పెత్తనమే సాగాలనేది బాలినేని అభిమతం. అటు సీట్ల కేటాయింపులో సైతం తన ముద్ర ఉండాలని భావిస్తూ వచ్చారు. ఒంగోలులో పాతికవేల మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తేనే పోటీ చేస్తానని ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరారు. మాగుంటకు టికెట్ నో చెప్పిన హై కమాండ్.. ఇళ్ల స్థలాల భూ సేకరణకు మాత్రం రూ.201 కోట్ల నిధులు కేటాయించింది. అయినా సరే మాగుంట పేరును మరోసారి బాలినేని తెరపైకి తెచ్చారు. కానీ జగన్ పట్టించుకోలేదు. ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఒంగోలు అసెంబ్లీ సీటు విషయంలో సైతం బాలినేనికి జగన్ హ్యాండ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతానికి బాలినేనికి ప్రత్యామ్నాయం లేదు. టిడిపిలో ఛాన్స్ లేదు. జనసేనలోకి వెళ్లినా టికెట్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఆయన ముందున్న కర్తవ్యం కాంగ్రెస్ పార్టీ. పీసీసీ పగ్గాలు షర్మిల అందుకున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడమే శ్రేయస్కరంగా అనుచరులు చెబుతున్నారు. ఒకవేళ ఒంగోలు అసెంబ్లీ సీటు బాలినేనికి కేటాయించుకుంటే ఆయన కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఒంగోలు మేయర్ గంగాడ సుజాత తో పాటు 25 మంది కార్పొరేటర్లు విజయవాడ వెళ్లి బాలినేని కలిశారు. ఒంగోలు రాజకీయాలపై చర్చించారు. బాలినేని ఎటువంటి నిర్ణయం తీసుకున్న తాము వెంట నడుస్తామని సంకేతాలు ఇచ్చారు. అయితే వైసిపి హై కమాండ్ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే.. బాలినేని తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular