Homeఅంతర్జాతీయంChinmoy Krishna Das : చనిపోయిన తల్లిని చూడనివ్వకుండా.. హిందువులపై బంగ్లాదేశ్ కర్కశత్వానికి నిదర్శనమిదీ..

Chinmoy Krishna Das : చనిపోయిన తల్లిని చూడనివ్వకుండా.. హిందువులపై బంగ్లాదేశ్ కర్కశత్వానికి నిదర్శనమిదీ..

Chinmoy Krishna Das : బతికున్నప్పుడు కొడుకును ఒక్కసారి చూడాలన్న తల్లి కోరిక తీరలేదు.. చివరికి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మాత్రమే కుమారుడికి అవకాశం.. ఐదు గంటల పెరోల్ ముగియగానే తిరిగి జైలుకు పయనం.. ఒక తల్లి చివరి కోరిక అది.. తన కొడుకును ఒక్కసారి చూడాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. చివరి క్షణాల్లో కొడుకు ముఖం చూసి కన్నుమూయాలనుకుంది. కానీ ఆ కోరిక నెరవేరలేదు. కొడుకు జైలు గోడల మధ్య ఉండగా.. ఆ తల్లి కన్నుమూసింది. […]

Chinmoy Krishna Das : బతికున్నప్పుడు కొడుకును ఒక్కసారి చూడాలన్న తల్లి కోరిక తీరలేదు.. చివరికి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మాత్రమే కుమారుడికి అవకాశం.. ఐదు గంటల పెరోల్ ముగియగానే తిరిగి జైలుకు పయనం..

ఒక తల్లి చివరి కోరిక అది.. తన కొడుకును ఒక్కసారి చూడాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. చివరి క్షణాల్లో కొడుకు ముఖం చూసి కన్నుమూయాలనుకుంది. కానీ ఆ కోరిక నెరవేరలేదు. కొడుకు జైలు గోడల మధ్య ఉండగా.. ఆ తల్లి కన్నుమూసింది. చివరకు తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఐదు గంటల పాటు మాత్రమే కుమారుడికి పెరోల్ లభించింది. ఆ ఐదు గంటల సమయం ముగియగానే.. కన్నీళ్లతో తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ విషయంలో అక్కడి విద్వేష మైనార్టీ హిందూ వ్యతిరేక ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై ఇప్పుడు భారత్ లోని హిందువుల్లో ఆగ్రహజ్వాలలు చెలరేగుతున్నాయి. ఈ ఘటన భారతీయులు, బంగ్లాదేశ్ లోని హిందువులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది.

తల్లిని చూడాలనుకుంది.. కానీ కోరిక తీరలేదు

బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోట్ అధికార ప్రతినిధిగా ఉన్న చిన్మయ్ కృష్ణ దాస్‌ 2024 నవంబర్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయ్యారు. జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఈ సమయంలో ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ (71) అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్యాన్సర్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఆమెను తీవ్రంగా వేధించాయి. ఛటోగ్రామ్‌లోని హఠాజారి ఆశ్రమంలో చికిత్స పొందుతూ చివరకు గురువారం కన్నుమూశారు. అయితే.. తన కుమారుడిని ఒక్కసారి చూడాలన్న ఆమె కోరిక మాత్రం తీరకుండానే ప్రాణాలు విడిచారు. తల్లి అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమెను చూసేందుకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు పెరోల్ ఇవ్వాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరారు. అయితే అనారోగ్యంతో ఉన్న బంధువును చూసేందుకు ఖైదీని విడుదల చేసే నిబంధన లేదంటూ ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైంది.

చివరికి తల్లి మరణం తర్వాతే పెరోల్..

తల్లి మరణించిన తర్వాత పరిస్థితి మారింది. చిన్మయ్ కృష్ణ దాస్‌ తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఛటోగ్రామ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ జహిదుల్ ఇస్లాం మియా ఐదు గంటల పెరోల్ మంజూరు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన చిన్మయ్ కృష్ణ దాస్‌ నేరుగా పుండరీక్ ధామ్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ రాధాకృష్ణ విగ్రహం పాదాలను తాకి కన్నీటిపర్యంతమయ్యారు. తన తల్లిని చివరిసారి చూడలేకపోయిన బాధ.. తన ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తల్లి అంత్యక్రియలు.. ఆ తర్వాత మళ్లీ జైలుకే..

ఐదు గంటల పెరోల్‌ సమయం చిన్మయ్ కృష్ణ దాస్‌కు తల్లితో గడిపే సమయం కాదు.. ఆమెకు అంతిమ వీడ్కోలు పలికే అవకాశం మాత్రమే ఇచ్చింది. తల్లి అంత్యక్రియలను పూర్తి చేసిన అనంతరం.. పెరోల్ గడువు ముగియగానే ఆయన తిరిగి ఛటోగ్రామ్ సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఒక వైపు తల్లి మరణం.. మరోవైపు జైలు జీవితం.. ఈ రెండింటి మధ్య తన తల్లికి చివరి వీడ్కోలు పలికిన ఓ కుమారుడి విషాదం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

దేశద్రోహం కేసుతో పాటు హత్య కేసు కూడా..

చిన్మయ్ కృష్ణ దాస్‌పై దేశద్రోహం కేసుతో పాటు.. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రభుత్వ ప్రాసిక్యూటర్ మరణానికి సంబంధించిన హత్య కేసు కూడా నమోదైంది. కొన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ లభించినప్పటికీ.. మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉండటంతో జైలులోనే కొనసాగుతున్నారు.

బంగ్లాదేశ్‌లో మైనారిటీల హక్కుల కోసం పనిచేస్తున్నట్లు చెప్పుకునే చిన్మయ్ కృష్ణ దాస్‌కు తల్లి అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమెను చూసేందుకు అవకాశం దక్కకపోవడం, మరణించిన తర్వాత కేవలం ఐదు గంటల పెరోల్‌పై అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కొడుకును చివరిసారైనా చూడాలన్న తల్లి కోరిక తీరలేదు.. తల్లికి చివరి వీడ్కోలు పలికిన వెంటనే కొడుకు మళ్లీ జైలు గోడల మధ్యకు వెళ్లిపోయాడు.

ఈ ఘటన.. ఓ తల్లి, ఓ కొడుకు మధ్య ఉన్న అనుబంధాన్ని మాత్రమే కాదు.. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దమనకాండ.. పక్షపాతం..  జైలు గోడల మధ్య మానవత్వం, న్యాయం, హక్కులపై కూడా ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper