Homeఅంతర్జాతీయంవెయ్యేళ్ల విపత్తు.. చైనా జనం చిత్తు

వెయ్యేళ్ల విపత్తు.. చైనా జనం చిత్తు

China Floodsచైనాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కనీవిని ఎరగని రీతిలో విరుచుకుపడుతోంది. జనజీవనం అతలాకుతలమైపోతోంది. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. పెద్ద పెద్ద భవంతుల ముందర భారీ చెరువులు దర్శనమిస్తున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి సృష్టించిన విలయంతో జనజీవనం స్తంభించిపోతున్నారు. ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నారు. గతంలో ఎన్నడు లేనంతగా తన ప్రభావాన్ని చూపిస్తోంది.

దేశం మొత్తం వర్షం ధాటికి దెబ్బతింటోంది. ఎల్లో నది ఉగ్ర రూపం దాల్చుతోంది. వరదలు పోటెత్తుతున్నాయి. జలాశయాలు నిండిపోతున్నాయి. 25 మంది మృత్యువాత పడ్డారు. 12.4 లక్షల మందిపై వరద ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు 1.60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సబ్ వే రైళ్లలో నడుములోతు నీళ్లలో చిక్కుకున్న ప్రయాణికులు సహాయం కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి.

వరదల కారణంగా 160 రైలు సర్వీసులు, 260 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. హెనన్ ప్రావిన్స్ రాజధాని ఝెన్ ఝౌలో మంగళవారం 457.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. శనివారం సగటున 640.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గత వెయ్యేళ్లలో ఇంతభారీ వర్షం చూడలేదని చైనీయులు చెబుతున్నారు. వరదలపై స్పందించిన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ సైన్యాన్ని సహాయక చర్యల నిమిత్తం పంపించారు. ఝెన్ ఝౌ నగరంలో విద్యుత్ , మంచినీటి సరఫరా తీవ్రంగా ప్రభావితం అయింది.

క్షణక్షణానికి పెరుగుతున్న వరద నీటిని మళ్లించడానికి హెనన్ ప్రావిన్స్ లోని యుచువాన్ కౌంటీలో దెబ్బతిన్న యిహెతన్ ఆనకట్టను చైనా పేల్చి వేసింది. ఈ ఆనకట్టకు 20 మీటర్ల మేర పగుళ్లు ఏర్పడ్డాయని, ఏ సమయంలోనైనా కొట్టుకుపోవచ్చునని సామాజిక అనుసంధాన వేదికలో అంతకుముందే పీఎల్ఏ ప్రకటించింది. ఇంతటి ఘోర విపత్తును చైనా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular