
కేంద్రం ఆదేశాలను పట్టించుకోకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ను సడలించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ ను సడలిస్తూ కేరళ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై కేంద్రం సీరియస్ అయింది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్లు, బుక్ షాపులు తెరవడం, కొన్ని పట్టణాల మధ్య బస్సు సర్వీసులు నడపడం, కార్లలో వెనుక సీట్లలో ఇద్దరితో ప్రయాణానికి అనుమతినివ్వడం వంటి సడలింపులను తప్పుబట్టింది. తక్షణమే వీటిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్రం రూపొందించిన గైడ్లైన్స్ను అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏప్రిల్ 15,2020న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆ లేఖలో తప్పుబట్టారు.
విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం జారీ చేసిన నిబంధనలను పాటించకుండా కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా వివిధ కార్యకలాపాల నిర్వహణకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం పట్ల పినరయి విజయన్ ప్రభుత్వాన్ని కేంద్రం నిలదీసింది.
అయితే కేంద్ర విమర్శలను కేరళ ప్రభుత్వం తిప్పికోట్టింది. మార్గదర్శకాల ప్రకారమే లాక్డౌన్ నిబంధనలు సడలించామని కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. అపార్థాలు చోటుచేసుకున్నందు వల్లే ఇలా జరిగిందని చెప్పారు.
కేంద్రం కోరిన వివరణను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. వివరణ ఇచ్చిన తర్వాత సమస్య సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర నిబంధనలనే మేం కచ్చితంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
కాగా లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ బీ, గ్రీన్ జోన్లుగా విభజిస్తూ అక్కడ పాటించాల్సిన నిబంధనలపై కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.
కాసర్గడ్, కన్నూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలను రెడ్ జోన్… పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలను ఆరెంజ్ ఏ జోన్… ఆరెంజ్ బీ జోన్లోని అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్, వయనాడ్, త్రిసూర్ జిల్లాలు… కొట్టాయం, ఇడుక్కి జిల్లాలను గ్రీన్ జోన్ కింద పరిగణిస్తూ కొన్ని రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చింది.