Homeజాతీయ వార్తలుMenu For Modi: మోడీకి వంట చేస్తున్న కరీంనగర్ మహిళ యాదమ్మ మాటలు వైరల్

Menu For Modi: మోడీకి వంట చేస్తున్న కరీంనగర్ మహిళ యాదమ్మ మాటలు వైరల్

Menu For Modi: దేశానికి రాజైనా ఆయన ఒకప్పుడు సాదాసీదా మనిషినే. మనలాగే చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన ఎవరో కాదు నరేంద్రమోడీ. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగిన మోడీకి ఇష్టమైన ఆహారం తినడం.. వివిధ రకాల వంటలు టేస్ట్ చేయడం అంటే మహా ఇష్టం. అందుకే తెలంగాణ రుచులను రుచిచూపించడానికి ఇక్కడి బీజేపీ నేతలు రెడీ అయ్యింది. అచ్చ తెలంగాణ మహిళ యాదమ్మను పిలిపించి మరీ మోడీకి వంటలు చేయిస్తున్నారు.

తెలంగాణలో కరీనగర్‌ ఉద్యమాలకు పురిటిగడ్డ.. పోరాటానికి స్ఫూర్తి.. అణచివేతపై తిరుగుబాటు గుర్తొస్తుంది. ఇలాంటి జిల్లా వంటకాలను ప్రధాని నరేంద్రమోదీ రుచి చూడనున్నారు. హైదరాబాద్‌లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న ప్రధానితోపాటు బీజేపీ ముఖ్య నేతలందరికీ కరీంనగర్‌ వంటకాలు రుచి చూపించేలా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు కరీంనగర్‌కు చెందిన యాదమ్మను బండి సంజయ్‌ హైదరాబాద్‌కు పలిపించారు. నోవాటెల్, హెచ్‌ఐసీసీతోపాటు నగరంలోని ప్రముఖ మాస్టర్‌ షెఫ్‌లను పిలిపించుకుని వారికి యాదమ్మతో వంటకాలపై అవగాహన కల్పిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ముస్తాబవుతోంది. జులై 2, 3 తేదీల్లో జరిగే సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరుకానున్నారు. దీంతో ఆ సమావేశాలను తెలంగాణ బీజేపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వీరందరికీ తెలంగాణ సంప్రదాయ రుచులు రుచి చూపించాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ స్పెషల్‌ వంటకాలను ఏరికోరి మెనూలో చేర్చారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి తెలంగాణ రుచులు చూపించాలని బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను అనే మహిళను హైదరాబాద్‌ తీసుకొచ్చారు.

వంటకాల్లో చేయితిరిగిన నలభీములు ఉన్న హైదరాబాద్‌ నగరంలోని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వంటలు చేయడానికి అనూహ్యంగా కరీంనగర్‌కు చెందిన యాదమ్మ ఎంపికైంది. దీంతో ఇప్పుడు నెటిజన్లు ఎవరీ యాదమ్మ అని ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ మహిళకు ఏకంగా దేశ ప్రధానికే వంటచేసి పెట్టే అవకాశం ఎలా వచ్చింది? అనే వివరాలు సేకరిస్తున్నారు. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది..
ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామానికి చెందిన యాదమ్మకు 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో మెట్టినింటికి చేరుకున్న యాదమ్మ కరీంనగర్ లోని మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. 29 ఏళ్లుగా వంట వృత్తినే జీవనాధారం చేసుకుంది.

సాధారణంగా తెలంగాణ వంటకాలు అంటే నాన్ వెజ్ లేకుండా ఉండదు. మటన్, చికెన్, చేపలు కచ్చితంగా ఉంటాయి. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాత్రం శాకాహార వంటకాలు చేయించాలని పార్టీ రాష్ట్ర నేతలు నిర్ణయించారు. ఈమేరకు శాకాహార వంటకాల్లో స్పెషలిస్టు అయిన యాదమ్మను ఎంపిక చేశారు. యాదమ్మ చేసే వంటకాలు తిన్నవారు ఎవరైనా ఆహా అనకుండా ఉండలేరు. ఒకేసారి 10 వేల మందికి కూడా వండివార్చే నేర్పరితనం ఆమె సొంతం. దీంతో పెద్ద సభలు, భారీ కార్యక్రమాలకు చాలామంది ఆమెనే పిలుస్తుంటారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌ పాల్గొనే కార్యక్రమాల్లోనూ యాదమ్మే వంటలు చేస్తుంటుంది.

ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ సహా అమిత్ షా, నడ్డా ఇతర కీలక ప్రముఖులపై వంట చేయడంపై యాదమ్మ ఎమోషనల్ అయ్యారు. ‘ఇది నా అదృష్టం’అంటూ ఉబ్బితబ్బిబయ్యారు. ఇందుకు సాయం చేసిన బండి సంజయ్ కు థాంక్స్ చెప్పారు. నాకు ఈ అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా అందరితోనూ మునుపటిలాగానే ఉంటానని యాదమ్మ తన నిజాయితీని.. సామాన్యగుణాన్ని చాటుకుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular