ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా ఉంది. ఎవరో పన్నిన కుట్రకు మరెవరో బలవుతారు. బీజేపీ కార్పొరేటర్, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఏర్పడిన చిన్న వివాదం ఇప్పుడు చిలికిచిలికి గాలివానలా మారుతోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇందులో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాత్రధారులుగా ఉన్నారు. జెండా పండుగ విషయంలో తలెత్తిన వివాదం ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పరస్పర వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది.
ఇద్దరు నేతల బూతుల పురాణం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజల చెంతకే చేరుతోంది. పరస్పర బూతుల దండకంతో ఒకరికన్నా మరొకరు పైచేయి సాధించాలని చూస్తున్నారు. ఇన్నాళ్లు బండి సంజయ్ కేసీఆర్ ను ఎంత విమర్శించినా నోరు మెదపని నేతలు ప్రస్తుతం మైనంపల్లి బూతులతో తాము చేయలేని పని ఆయన చేస్తున్నారని సంబరపడిపోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బీజేపీ శ్రేణులు సైతం స్పందిస్తున్నాయి. మైనంపల్లి పై విరుచుకుపడుతున్నారు.
అయితే కేసీఆర్ అనుమతిస్తే బండి సంజయ్ బాగోతం బయటపెడతానని మైనంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్ రాసలీలల రహస్యం తన వద్ద ఉందని చెబుతున్నారు. బట్టలిప్పి బజార్లో నిలబెడతానని విమర్శలు చేస్తున్నారు. త్వరలోనే వాటిని బయటపెడతానని బెదిరింపులకు గురి చేస్తున్నారు. హాఫీజ్ పేటలో భూముల సెటిల్ మెంట్ చేస్తున్నారని చెబుతున్నారు.
ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అదే స్థాయిలో మాట్లాడితే పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదని పార్టీ నేతలు భయపడుతున్నారు. రాజకీయ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భావిస్తున్నారు. మైనంపల్లి తీరుపై బీజేపీలో చర్చ జరుగుతోంది. తీవ్రమైన పదజాలంతో ఎదురుదాడికి తెగబడుతున్న మైనంపల్లికి బుద్ది చెప్పాల్సిందేనని నేతలు స్పందిస్తున్నారు. టీఆర్ఎస్ చేస్తున్న ఆగడాలు ఎవరికి తెలియవని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి నేతల ప్రతిష్ట కోసం పార్టీనే పణంగా పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.