బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు డేట్ ఫిక్స్ చేశారు.. పేరు కూడా అనౌన్స్ చేశారు. బండి మొదలు పెట్టనున్న యాత్రకు.. ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ అని పేరు పెట్టారు. ఈ నెల 24న హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ యాత్ర మరోసారి వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది.
నిజానికి బండి సంజయ్ పాదయాత్ర ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. కానీ.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ పేరుతో పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర కారణంగా బండి తన టూర్ ను వాయిదా వేసుకున్నారు. అన్నీ చూసుకొని ఆగస్టు 24 నుంచి యాత్ర మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. కానీ.. మరో అవాంతరం వచ్చి పడింది.
తాజాగా.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ చనిపోయారు. శనివారం ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో.. ఈ నెల 24 వరకు ఆయన సంతాప దినాలు జరుపుకోవాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణులకు ఆదేశాలు కూడా వెళ్లాయి. దీంతో.. దేశవ్యాప్తంగా సంతాప సభలు జరుపుతున్నారు. 24 వరకు ఎలాంటి ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించొద్దని అధిష్టానం ఆదేశించినట్టుగా చెబుతున్నారు. అదే జరిగితే.. బండి యాత్ర కూడా వాయిదా పడుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇదిలాఉంటే.. తెలంగాణ బీజేపీలో మూడు గ్రూపులు ఏర్పడ్డాయని, గ్రూపు తగాదాలు తీవ్రస్థాయిలోనే కొనసాగుతున్నాయనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు.. బండి యాత్ర జరగకుండా ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇటు చూస్తే.. సంజయ్ పాదయాత్ర వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మరి, ఇంతకూ యాత్ర కొనసాగుతుందా? లేదా? అన్నది చూడాలి.