Homeఆంధ్రప్రదేశ్‌కోవిడ్ సోకనివారు ఉండరేమో: జగన్

కోవిడ్ సోకనివారు ఉండరేమో: జగన్


జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే నా బలమని తాను ప్రతి సారి చెబుతున్నానని, మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించి పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలను ఉద్దేశించి పేర్కొన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే అని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కరోనా వైరస్‌ నివారణలో అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. క్షేత్ర స్థాయిలో గ్రామ వాలంటీర్, సచివాలయం, ఆశావర్కర్లు, ఏఎస్‌లు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు అంతా అద్భుతంగా పని చేశారన్నారని తెలిపారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షను మంగళవారం నిర్వహించారు.

ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్‌లో కొనసాగుతుందని, ఇంతకుముందు మనం అనుసరించిన పద్దతి వేరు, నాలుగో విడత లాక్‌డౌన్లో అనుసరిస్తున్న పద్దతి వేరని చెప్పారు. ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. కోవిడ్‌ -19 నివారణపై మన దృష్టి ఉంచుతూనే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు.ఎకానమీ పూర్తిగా ఓపెన్‌ కావాలని, కలెక్టర్లు, ఎస్పీలు అందులో భాగస్వామ్యం కావాలని సూచించారు. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు ఇవి తప్ప మిగిలిన చోట అంతా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాల్సి ఉందన్నారు. చిన్న చిన్న దుకాణాల దగ్గరినుంచి ప్రతీదీ తిరిగి పునఃప్రారంభం చేయాలన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ప్రజా రవాణా ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ రెండూ తప్పనిసరిగా పాటిస్తూ అన్నీ ప్రారంభం కావాలన్నారు. మనం కోవిడ్‌-19తో కలిసి జీవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కోవిడ్‌ -19 సోకిన వారిని వివక్షతో చూడ్డం అన్నది సమాజం నుంచి తొలగించాలన్నారు. రాబోయే కాలంలో కోవిడ్‌ రానివారు ఎవ్వరూ ఉండరేమో అని చెప్పారు. అది వస్తుంది.. పోతుందన్నారు. కోవిడ్‌ పట్ల భయాన్ని తొలగించాలని, ఈ వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించాలని సూచించారు.

ప్రజలు తమకు తాముగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. స్వచ్ఛందంగా తమ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పే పరిస్థితి రావాలని కోరారు. దీన్ని మనం ప్రోత్సహించాలని చెప్పారు. పరీక్షల కోసం ఎవర్ని సంప్రదించాలి, ఎక్కడకు వెళ్లాలి, ఎలా పరీక్షలు చేయించుకోవాలనే అంశాలపై ఎడ్యుకేట్‌చేయాలన్నారు. పరీక్షల సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు. వీటి నిర్మాణం కలెక్టర్ల ప్రథమ పనిగా భావించాలని స్పష్టం చేశారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల పరిధిని తగ్గించుకుంటూ వెళ్లాలని, భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, చేతులు శుభ్రపరుచుకునేలా ప్రజల్లో పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలని తెలిపారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular