మూడు రాజధానుల విషయంలో మరో ట్విస్ట్ నెలకొంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించినందున చట్టపరంగా తమకు ఇబ్బందులు లేవని భావిస్తున్న ప్రభుత్వానికి తాజాగా చట్టపరంగా మరో చిక్కు వచ్చిపడింది. ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపిన బిల్లులపై శాసన మండలి ఛైర్మన్ సంతకం లేకపోవడంతో ఈ బిల్లుల ఆమోదం చెల్లుబాటు కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఉభయ సభల్లో బిల్లు ప్రవేశ పెట్టిన అనంతరమే గవర్నర్ ఆమోదించేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.
Also Read: ఏపీ గవర్నర్ మారనున్నారా?
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఈ నెల 17న శాసనసభలో ఆమోదించి శాసన మండలికి పంపారు. మండలిలో ఈ బిల్లులు ప్రవేశపెట్టలేదు. అధికార, విపక్ష సభ్యుల మధ్య నెలకొన్న వివాదంలో మండలిని చైర్మన్ నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో బిల్లులపై మండలి ఛైర్మన్ షరీఫ్ సంతకాలు చేయలేదు. శాసన మండలికి పంపిన 30 రోజుల అనంతరం మండలిలో ఆమోదించినట్లుగా ప్రభుత్వం భావించి గవర్నర్ ఆమోదానికి పంపింది. మండలి ఛైర్మన్ సంతకం లేకపోవడంతో ఈ బిల్లు ఆమోదం చెల్లుబాటు కాదని, బిల్లులు చట్ట రూపం దాల్చవనే వాదనలు వినిపిస్తున్నాయి.
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదం, మూడు రాజధానుల విషయంపై ఎమ్మెల్సీ అశోక్ బాబు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆయన తన పిటీషన్ లో ఈ అంశాలను ప్రస్తావించినట్లు ఆయన తరుపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ రెండు బిల్లులపై శాసన మండలి ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సంతకాలు ఉన్నప్పుడే గవర్నర్ ఆమోదించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అశోక బాబు తన పిటీషన్ లో రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ, హోం శాఖలను ప్రతివాదులుగా చేర్చారు.
Also Read: జేసీ సోదరులకు బీజేపీ తలుపులు మూసిందా?
ఇప్పటికే హై కోర్టులో ఈ అంశాలకు సంబంధించి అనేక పిటీషన్ లు దాఖలు అవడంతో హై కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీ అశోక్ బాబు పిటీషన్ ఇందుకు సంబంధించినదే కావడంతో ఈ నెల 14వ తేదీన జరిగే విచారణలో ఈ పిటీషన్ కూడా పరిగణలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. మరోవైపు 14వ తేదీన ఈ అంశంపై ప్రభుత్వం తన కౌంటర్ పిటీషన్ ను హై కోర్టులో దాఖలు చేయనుంది. హై కోర్టు విచారణలో ఏం ఆదేశాలు జారీ చేస్తుందనేది వేచి చూడాల్సిందే.