Amit Shah Border Security Plan: ఒక దేశంలో అంతర్గత భద్రత పటిష్టంగా ఉంటేనే .. అక్కడి ప్రజలకు మెరుగైన జీవనం లభిస్తుంది. అలాకాకుండా అంతర్గత భద్రత ఇబ్బందికరంగా ఉంటే ప్రజల పరిస్థితి దారుణంగా ఉంటుంది. గతంలో మన దేశంలో అంతర్గత భద్రత అంత గొప్పగా ఉండేది కాదు. ముఖ్యంగా బిఎస్ఎఫ్ ఆధీనంలో ఉన్న 15 రాష్ట్రాలలో చొరబాట్లు ఉండేవి. ఫలితంగా ఆయుధాలు అక్రమంగా మనదేశంలోకి రవాణా అయ్యేవి. నకిలీ నోట్లు, మాదకద్రవ్యాలు వచ్చేవి. దీనివల్ల దేశంలో ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకునేవి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బంగ్లాదేశ్ నుంచి భారీగా వలసలు ఉండేవి. మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ప్రజలకు మన దేశ పౌరసత్వం లభించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అస్సాం.. త్రిపుర రాష్ట్రాలలో కూడా బంగ్లాదేశ్ ప్రజలకు మన దేశ పౌరసత్వం సులభంగానే లభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలలో ఒక్క మతానికి సంబంధించిన జనాభా అధికంగా పెరుగుతున్నట్టు కేంద్రం గుర్తించింది. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలలో ఒక మతానికి సంబంధించిన జనాభా అధికంగా పెరుగుతోందని.. దీనివల్ల సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. ఆయన మాటలను చాలామంది తేలికగా తీసుకున్నారు.
ప్రధానమంత్రి ఆ మాటలను ఇప్పుడు క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి మనదేశంలో ఉన్న 15 రాష్ట్రాల సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఏకంగా కంచెలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేకాదు ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ హై లెవెల్ కమిటీ అన్ని రాష్ట్రాలలో జనాభా లెక్కలను పరిశీలిస్తుంది. ఒక మతంలో అధికంగా పెరుగుదల ఉంటే.. అది ఎందుకు సాధ్యమైందో లోతుగా విశ్లేషణ చేస్తుంది. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది.
ఇప్పటికే హోమ్ మినిస్టర్ అమిత్ షా రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ సరిహద్దులను పరిశీలించారు. మరోవైపు అస్సాం, త్రిపుర ప్రాంతాలలో ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారిని బయటికి పంపించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా పంపిస్తున్నారు. మిగతా ప్రాంతాలలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారని తెలుస్తోంది. సరిహద్దు రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటించడం.. కంచె నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో.. ఇకపై చొర బాట్లు.. అక్రమ కార్యకలాపాలకు తావుండదని జాతీయ వాదులు చెబుతున్నారు.
