Amit Shah Pakistan Border Visit: ఇటీవల కాలంలో పాకిస్తాన్ దేశానికి భారత్ షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. పాకిస్తాన్ తేరుకునే లోపు దిమ్మ తిరిగే విధంగా చేస్తోంది. ఇప్పుడిక భారత్ ఒక అడుగు ముందుకేసింది. పాకిస్తాన్ కుట్రలకు.. పాకిస్తాన్ చేస్తున్న దారుణాలకు చరమగీతం పాడేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. భద్రత విషయంలో మన దేశ ఆర్మీకి సూచనలు చేస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే విధంగా అమిత్ షా స్కెచ్ వేశారు. అది కాస్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని అత్యంత సున్నితమైన హరామి నాలా, సర్ క్రీక్ ప్రాంతంలో అమిత్ షా పర్యటించారు. ఈ ప్రాంతాలు పాకిస్తాన్ కు అత్యంత దగ్గరగా ఉంటాయి. ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి పశ్చిమ సరిహద్దు వెంబడి అమిత్ షా భద్రత ఏర్పాట్లను పరీక్షించారు. కొత్తగా ఏర్పాటుచేసిన బోర్డర్ అవుట్ పోస్ట్ జి7 ను ఆయన ప్రారంభించారు. హరామి నాలా అత్యంత చిత్తడిగా ఉంటుంది. ఇందులో నిత్యం పాములు.. తేళ్లు కనిపిస్తూ ఉంటాయి. మన భారతదేశ ఆర్మీకి అత్యంత కఠినమైన ప్రదేశం ఇది. అంతేకాదు.. ఈ ప్రాంత విషయంలో పాకిస్తాన్ దేశానికి.. మనకు వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రాంతం మీద పట్టు సాధించడానికి కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
అవుట్ పోస్ట్ జి7 ప్రారంభించిన తర్వాత ఓపి టవర్ 1170 లో ఆయన కంట్రోల్ సందర్శించారు. సర్ క్రీక్ ప్రాంతంలో పడవ ద్వారా పర్యటించారు అంతేకాదు పర్యటన సందర్భంగా జట్టి పాయింట్ వద్ద ఆయన మొక్కలు నాటారు. భుజ్ ప్రాంతంలో బిఎస్ఎఫ్ సెక్టార్ ప్రధాన కార్యాలయంలో ఆర్మీ సిబ్బందితో ఆయన అత్యంత రహస్యంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నవంబర్ లోనే బిఎస్ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు అమిత్ షా హాజరయ్యారు. కచ్ ప్రాంతానికి అమిత్ షా రావడం గడచిన ఆరు నెలల్లో ఇది రెండవసారి.
అమిత్ షా ఇలా పర్యటించడంతో పాకిస్తాన్ గుండెల్లో గుబులు మొదలైంది. భారత్ ఏదో చేస్తోందనే భయం పాకిస్తాన్లో కనిపిస్తోంది. అందువల్లే భారత్ సరిహద్దులను పాకిస్తాన్ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అంతేకాదు అక్కడ కీలకమైన ఎయిర్ బేస్ లు నిర్మిస్తున్న నేపథ్యంలో.. అమిత్ షా అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడ మాత్రమే కాదు.. పాకిస్తాన్ సరిహద్దు వెంట అత్యంత కఠినమైన..కంచెలు నిర్మిస్తామని అమిత్ షా ప్రకటించడం ఇక్కడ విశేషం.
