Haryana Election Result 2024: కాంగ్రెస్ కంటే ముందు హర్యానాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ ఆయన ఆశలు అడియాసలు అయ్యాయి. హర్యానా లో అధికారంలోకి రావాలని భావించిన ఆయన.. ఇటీవల తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయనప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. హర్యానాకు పొరుగున ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఆప్ అధికారంలో ఉంది. కానీ అదే మ్యాజిక్ ను హర్యానాలో కంటిన్యూ చేయలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా ముందంజలో లేరంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే హర్యానాలో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ ఓటమికి అనేక కారణాలను రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీతో ఏకాభిప్రాయం కుదరకపోవడం ఆప్ కు మైనస్ పాయింట్ గా పరిణమించింది. ఇది బిజెపికి లబ్ధి పొందడానికి కారణమైంది. ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మొత్తం చీలిపోయాయి. ఆప్ మొదట కాంగ్రెస్ పార్టీని 10 సీట్లు అడిగింది. దానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. పైగా ఐదు సీట్లు మాత్రమే ఇస్తానని స్పష్టం చేసింది. చివరికి మూడు సీట్లు ఇస్తామని పేర్కొనడంతో.. దానికి ఆప్ ఒప్పుకోలేదు.
భూపేందర్ సింగ్ హుడా నిర్ణయంతో..
హర్యానా ఎన్నికల్లో ఆప్ సహకారాన్ని కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ హుడా మొదటి నుంచి వ్యతిరేకించారు. ఆప్ సాయం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని ఆయన పలు సభల్లో వ్యాఖ్యానించారు. ఇది సహజంగానే కాంగ్రెస్ పార్టీ – ఆప్ మైత్రిని చెడగొట్టింది . ఎన్నికల ప్రచారంలో ఆప్ నేతలు తగిన స్థాయిలో ఉత్సాహాన్ని ప్రదర్శించలేదు. గత ఎన్నికల్లోనూ ఆప్ నేతలు ఇలానే పనిచేశారు. అప్పుడు కూడా ఓటమే ఎదురైంది. తీరా ఇప్పుడు ఓట్లు శాతం కూడా తగ్గిపోయింది. ఇక హర్యానా రాష్ట్రంలో బిజెపికి అనుకూల పవనాలు వీచాయి. భారత జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న స్థానాలను ఆప్ కు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసింది. అయితే అక్కడ పోటీని ఎదుర్కోవడంలో ఆప్ పూర్తిగా విఫలమైంది. మరోవైపు హర్యానాలోని కిందిస్థాయి కార్యకర్తల నుంచి ఆప్ కు ఊహించని స్థాయిలో మద్దతు లభించలేదు. స్థానిక నాయకత్వం పట్టించుకోకపోవడంతో ఆప్ విజయాలు సాధించలేకపోయింది. ఇక ఈ ఎన్నికల్లో పలు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది. అందువల్ల ఆప్ విజయ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. పైగా ఆప్ నేతలు అనేక వివాదాలలో కూరుకుపోయారు. దానివల్ల ఆ పార్టీ ప్రతిష్ట దారుణంగా దెబ్బతిన్నది. హర్యానా ప్రజల మనసులను గెలుచుకోవడంలో ఆప్ దారుణంగా విఫలమైంది. హర్యాన రాష్ట్రంలో తన బలాన్ని అంచనా వేయడంలో ఆప్ తప్పటడుగులేసింది. అది అంతిమంగా పార్టీ వైఫల్యానికి దారితీసింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి కొంతమంది నాయకులు ముందుకు రాలేదు. పోటీలో ఉన్న నాయకులు సరిగ్గా ప్రచారం చేయలేదు. పైగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు చివరి వరకు కుదరకపోవడం.. అప్పటికప్పుడు అభ్యర్థులను ఎంపిక చేయడం ఆప్ ఓటమికి దారి తీశాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More