Tarakaratna’s wife : తారకరత్న మరణించి సరిగ్గా నెల రోజులు. ఫిబ్రవరి 18న బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆరంభ కార్యక్రమంలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్ర మొదలైన కాసేపటికే తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలిపోయారు. స్థానిక ఆసుపత్రికి తరలించిన సిబ్బంది మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు తరలించారు. 23 రోజులు తారకరత్నకు ఐసీయూలో చికిత్స అందించారు. మృత్యువుతో పోరాడి తారకరత్న తుదిశ్వాస విడిచారు.
తారకరత్న దూరమై నెల రోజులు అవుతుండగా భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. సుదీర్ఘ సందేశంలో ఆమె పలు విషయాలు ప్రస్తావించారు. తారకరత్నను గుర్తు చేసుకుంటూనే జీవితంలో అనుభవించిన కష్టాలు, ఎదురైన అవమానాలు, చీదరింపులు గురించి వెల్లడించారు. తాము ప్రేమ పెళ్లి చేసుకోవడంతో బహిష్కరణకు గురైనట్లు ఆమె చెప్పారు. పెళ్లి నిర్ణయం ఇబ్బందులు పాలు చేసిందన్నారు. కొందరు తమపై ద్వేషం చూపించారని. అయినవాళ్లే పలు మార్లు మానసిక వేదనకు గురి చేసినట్లు సందేశంలో పొందుపరిచారు.
కుటుంబానికి దూరమై ఒంటరి కావడం వలన తారకరత్న పెద్ద కుటుంబం కోరుకున్నారని, పిల్లలు పుట్టాక తమ జీవితం ఆనందమయంగా మారిందన్నారు. మనం ఎప్పటికైనా కలుసుకుంటాము. నువ్వు రియల్ హీరో… అని అలేఖ్య సోషల్ మీడియా పోస్ట్ లో కామెంట్స్ చేశారు. నందమూరి కుటుంబం తారకరత్నను నిరాదరణకు గురి చేసినట్లు ఆమె మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. పేరెంట్స్ కి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ద్వేషించి, అవమానించారని ఆమె చెప్పకనే చెప్పారు.
అలేఖ్య రెడ్డికి తారకరత్నతో రెండో వివాహం. గతంలో ఆమెకు మొదటి భర్తతో విడాకులు అయ్యాక తారకరత్నను ప్రేమ వివాహం చేసుకున్నారు. తారకరత్న హీరోగా తెరకెక్కిన నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ళు డేటింగ్ చేసిన వీరిద్దరూ 2012లో వివాహం చేసుకున్నారు. అలేఖ్య రెడ్డితో వివాహాన్ని తారకరత్న పేరెంట్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఏళ్ల పాటు తారకరత్నను బహిష్కరించారు.