దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. బాలీవుడ్లో ప్రకంపణలు రేపిన యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలిచ్చింది. సుశాంత్ మృతిపై సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా ఈ కేసు విచారణలో సీబీఐకి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ హృషికేశ్ రాయ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ రంగ ప్రవేశం చేయనుండడంతో సుశాంత్ మృతి వెనకున్న వారి వెన్నులో భయం మొదలైంది. ముఖ్యంగా సుశాంత్ ప్రేయసి రియాతో పాటు మరికొందరు బడా బాబులకు మూడినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని సుప్రీం సమర్థించింది. సుశాంత్ మరణానికి ముందు జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తునకు రియా సహకరించలేదు. కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో తానేం చెప్పనని మొండికేసింది. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగుతుంది కాబట్టి ఎవ్వరి పప్పులు ఉడకవు. సుశాంత్ మృతిపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తుంది కాబట్టి కాస్త ఆలస్యమైనా నిజానిజాలు కచ్చితంగా బయట పడుతాయి.
Also Read: శ్రీరాముడు ప్రభాస్, సీత కీర్తి సురేషేనా..!
జూన్ 14 వ తేదీన సుశాంత్ ముంబై బాంద్రాలోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మానసిక ఒత్తిడి, కుంగుబాటు వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని మొదట భావించారు. కానీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా కొందరు ప్రేరేపించారన్న ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక రియాతో పాటు పలువురు బాలీవుడ్ బడా బాబులు, మహారాష్ట్రకు చెందిన రాజకీయ ప్రముఖులు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ముంబై పోలీసుల విచారణ అర్థవంతంగా లేదని, ప్రత్యక్ష సాక్షులు, ప్రాధమిక అనుమానితులను సైతం సరిగ్గా విచారించడం లేదన్న విమర్శలు వచ్చాయి. ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి.. సుశాంత్కు సన్నిహితంగా ఉన్న వారందరినీ వరుసగా ఇంటర్వ్యూ చేస్తూ అనేక అనుమానాలను బయట పెట్టడంతో ఈ కేసు రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని సుశాంత్ స్వరాష్ట్రం బీహార్ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. ఇలా అనేక మలుపులు తిరుగుతూ తమ వద్దకు వచ్చిన ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.