దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. పేద, ధనిక.. సామాన్యుడు, సెలబ్రిటీ అన్న తేడా లేకుండా అజాగ్రత్తగా ఉన్న అందరినీ కాటు వేస్తోంది. ముఖ్యంగా ఎప్పుడూ ప్రజల్లో ఉండే రాజకీయ నాయకులకు వైరస్ ప్రమాదం పొంచి ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కర్నాటక మాండ్య ఎంపీ, ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోయిన్గా వెలుగొందిన సుమలతకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!
‘డియర్ ఫ్రెండ్స్.. శనివారం, జులై 4 నుంచి నాకు తలనొప్పి, గొంతు నొప్పి మొదలయ్యాయి. నా నియోజకవర్గ పనులు, ఇతర పర్యటనల కారణంగా నేను కోవిడ్-19 బారిన పడ్డానేమోననే సందేహంతో పరీక్షలు చేయించుకున్నా. ఈ రోజు ఫలితం వచ్చింది. నాకు పాజిటివ్ అని తేలింది. అయితే లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉన్నాయి. దాంతో ఇంట్లో ఉండి చికిత్స తీసుకోమని వైద్యులు సూచించారు. ఇప్పుడు నేను హోమ్ క్వారంటైన్లోనే ఉంటూ డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నా. దేవుడి దయ వల్ల నా రోగనిరోధక శక్తి మెరుగ్గానే ఉంది. మీ అందరి ఆశీస్సులతో ఈ మహమ్మారి నుంచి నేను తొందర్లోనే కోలుకుంటానని నమ్మకంగా ఉన్నా. నాకు గుర్తున్న మేరకు ఈ మధ్య నాతో కాంటాక్ట్ అయిన వ్యక్తుల వివరాలను అధికారులకు అందించా. అయినా సరే నాతో కాంటాక్ట్ అయిన వారిలో ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా వైరస్పై యుద్ధంలో మనం విజయం సాదిద్దాం’ అని సుమలత వరుస ట్వీట్స్ చేశారు. కాగా, విషయం తెలిసిన సుమలత అభిమానులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
https://twitter.com/sumalathaA/status/1280125785353797632