Santhakumari: శాంతకుమారి.. తెలుగు తెర పై నిండు గోదారి లాంటి సహజ నటి ఆమె. వయసులో తన కంటే నాలుగేళ్లు చిన్నవాడైన అక్కినేని నాగేశ్వరరావుతో ‘మాయాలోకం’ చిత్రంలో కథానాయికగా నటించింది. మళ్ళీ ఆ తర్వాత అదే నాగేశ్వరరావుకి తల్లిగానూ నటించి మెప్పించింది. ఇక తనకంటే ఎనిమిదేళ్ళు చిన్నవాడైన గుమ్మడికి ఓ సినిమాలో చెల్లిగా నటించింది. ఆ తర్వాత అదే గుమ్మడితో అరడజను పైగా చిత్రాల్లో భార్యగానూ నటించి మెప్పించింది.
పైగా తెలుగు తొలితరం కథానాయిక కూడా శాంతకుమారినే. అన్నిటికీ మించి ఆమె మధురమైన గాయని కూడా. శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. పి.వి.దాస్ నిర్మించిన “మాయాబజార్” చిత్రంలో శశిరేఖగా చిత్రసీమలో ప్రవేశించారు. తన నటనతో ఆమె బాగా ఆకట్టుకున్నారు. ఆమెను చూసి అప్పటి మేటి దర్శకుడు పి.పుల్లయ్య ఇష్టపడ్డారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అయినా ఎదిరించి వివాహమాడారు.
ఆ తర్వాతే పుల్లయ్య ఆమెకు శాంతకుమారి అని పేరు మార్చారు. పేరుకు తగ్గట్టు ఎన్నో చిత్రాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు తల్లిగా, వదినగా శాంతకుమారి తన అపురూపమైన కరుణ రస పూరిత నటనతో ఆకట్టుకున్నారు. అయితే, ఎన్టీఆర్ గారికి ఆమె గాత్రం అంటే ఎంతో ఇష్టం అట. సెట్ లో ఆమె కనిపిస్తే చాలు.. వెంటనే ఎన్టీఆర్ గారు ఆమె దగ్గరకు వెళ్లి.. ‘శాంతకుమారి గారు మీ అభిమాని వచ్చాడు. మీ పాట వినడానికి’ అని నవ్వుతూ ఆమెకు ఎదురుగా ఎన్టీఆర్ కూర్చునే వాడు.
Also Read: ఫుల్ జోష్ లో నాని.. ఇది ఎవ్వరూ ఊహించలేదు !
శాంతకుమారి సహజ గాయని. ఆమె అతి సులభంగా పాట పాడేవారు. అందుకే, అప్పట్లో అందరూ ఎన్టీఆర్ ని అభిమానిస్తే.. ఎన్టీఆర్ మాత్రం ‘శాంతకుమారి’ని అభిమానించే వారు. ఆమె గాన వైభవానికి ఎన్టీఆర్ ఎంత ముచ్చట పడకపోతే.. తాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తల్లా పెళ్ళామా’ సినిమాలో కీలకమైన తల్లి పాత్రను శాంతకుమారి చేత వేయిస్తాడు.
పైగా ఆమె నోట ‘మమత లెరిగిన నా తండ్రు..’ అంటూ ఆర్థత ఉట్టిపడేలా పాట పాడించుకుంటారు. అందుకే, ఎన్టీఆర్ ఇష్టమైన పాటల్లో ‘మమత లెరిగిన’ పాట కూడా ఒకటి అట. పైగా శాంతకుమారి భక్తి రసం ఉట్టిపడేలా గానం చేయడంలో దిట. అందుకే ఆమె గాత్రానికి కరుణ రసం కూడా అతి సహజంగా పలికేది.
Also Read: ‘హీరో’ బాగానే ఉన్నాడు గానీ, ఇంకా బెటర్ గా ఉండొచ్చు !