Liger Disaster: లైగర్ ఫెయిల్యూర్ తో దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి నిండా మునిగిపోయారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటున్నారు.సినిమాను భారీ ధరలకు అమ్ముకున్న వారిద్దరు సేఫ్. ఛార్మి పిచ్చ హ్యాపీ అన్నమాట వినిపిస్తుంది. లైగర్ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే వాళ్లకు బాగానే మిగిలిందని ట్రేడ్ వర్గాల అంచనా. లైగర్ చిత్రాన్ని రూ. 60 నుండి 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అన్ని భాషల్లో కలిపి రూ. 90 కోట్లకు థియేట్రికల్ హక్కులు విక్రయించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే దాదాపు రూ. 20 కోట్ల లాభం ఆర్జించారు. లైగర్ బిజినెస్ లో కేవలం 35 శాతం మాత్రమే రికవరీ చేసింది. బయ్యర్లకు నష్టాల్లో కొంత తిరిగి చెల్లించాల్సి ఉంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన లాభాలు బయ్యర్లకు ఇచ్చేసినా… లైగర్ శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ తో కనీసం ముప్పై కోట్లకు పైగా పూరి-ఛార్మిలకు దక్కుతాయి. అంటే లైగర్ డిజాస్టర్ అయినప్పటికీ నిర్మాతలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. బయ్యర్లు మాత్రం నష్టపోయారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా లైగర్ తో నష్టపోయారు. ఒప్పందం ప్రకారం విజయ్ దేవరకొండకు రెమ్యూనరేషన్ గా రూ. 25 కోట్లు చెల్లించాలి. లైగర్ విడుదలకు ముందే జనగణమన సేమ్ కాంబినేషన్ లో స్టార్ట్ చేశారు.
ఆ కారణంతో పాటు లైగర్ విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్న విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ లో కేవలం 25% మాత్రమే తీసుకున్నారట. చెప్పినట్లు రూ. 25 కోట్లు ఇవ్వకున్నా ఎంతో కొంత తిరిగి చెల్లిస్తారని విజయ్ దేవరకొండ ఎదురుచూస్తున్నాడట. జనగణమన సైతం ఆగిపోయినట్లు వార్తలు వస్తుండగా, లైగర్ సినిమాకు విజయ్ దేవరకొండకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఛార్మి-పూరిలు ఇవ్వలేదట. విజయ్ కూడా గట్టిగా అడగలేకపోతున్నారట.

ఈ మొత్తం సినారియోలో లైగర్ వలన నష్టపోయింది బయ్యర్లు, విజయ్ దేవరకొండ మాత్రమే. పూరి-ఛార్మితో పాటు కరణ్ జోహార్ కూడా సేఫ్ అట. కాగా ఛార్మి సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్స్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ ని బలోపేతం చేసే పనిలో ఉన్నాం. తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతామంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇస్మార్ట్ శంకర్ 2 స్క్రిప్ట్ పై పూరి పని చేస్తున్నారన్న కథనాలు వెలువడుతున్నాయి. అలాగే కొడుకు ఆకాష్ పూరీతో మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా లైగర్ పూరి ఇమేజ్ ని భారీగా డామేజ్ చేసింది.