Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చెయ్యాలని , అందాల ఆరబోతకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని కొన్ని లిమిట్స్ ని పెట్టుకొని ఆమె తన సినీ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఈమె ‘ది ఇండియన్ స్టోరీ’ అనే చిత్రం చేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే విధంగా బాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతున్న ‘రామాయణం’ లో ఈమె రావణుడి భార్య అయినటువంటి మండోదరి పాత్ర పోషించింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా, మొదటి భాగం దీపావళి కానుకగా విడుదల కాబోతుంది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కాజల్ అగర్వాల్ బాలీవుడ్ పై చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ ‘సౌత్ ఇండియా లో నాకు ఎన్నో అద్భుతమైన పాత్రలు దక్కాయి. నాలోని నటిని బయటకు తీశాయి. అలాంటి పాత్రలు బాలీవుడ్ లో నాకు ఇప్పటి వరకు రాలేదు. అన్ని పనికిమాలిన రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాంటి పాత్రల్లో నటించడానికి నేను సిద్ధంగా లేను. మంచి నాణ్యత ఉన్న సినిమాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నాను. బాలీవుడ్ సెట్ లో క్రమశిక్షణ , సమయపాలన వంటివి పద్దతిగా ఉండవు. సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ షూటింగ్ సమయం లో నన్ను చాలాసేపు వేచి చూసేలా చేశారు. ఆయన షూటింగ్ కి మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో వచ్చేవారు , ఈ గ్యాప్ లో నేను షూటింగ్ సెట్స్ లోనే జిమ్ లో వర్కౌట్స్ చేసుకుంటూ ఉండేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘సౌత్ ఇండస్ట్రీ అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడి నటీనటులు , టెక్నీషియన్స్ క్రమశిక్షణ పాటిస్తుంటారు. పైగా ఈమధ్య కాలం లో సౌత్ లో వచ్చిన మార్పులు చాలా బాగున్నాయి. ఒకప్పుడు మహిళల బొడ్డులను చూపించేవారు , దాని పై పండ్లు విసిరే సన్నివేశాలు వంటివి చూపించేవారు. కానీ ఇప్పుడు అలాంటివి లేవు , మహిళకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఈమధ్య కాలంలో సౌత్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఈ మార్పు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. అయితే కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయలేదు, ఇక నుండి అలాంటి పాత్రలే చేస్తానని అంటోంది కాబట్టి , రామాయణం లో ఆమె ఎలా నటించబోతుందో చూడాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






