Narayan Jagadeesan: టీమిండియాలో అభిషేక్ శర్మ సృష్టిస్తున్న సంచలనాలు మామూలువికావు. ముఖ్యంగా టి20 లలో అతడు అనితర సాధ్యమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ప్రత్యర్థి జట్ల బౌలర్ల అంచనాలకు అందకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. విధ్వంసం అనే పదానికి సరికొత్త అర్ధాన్ని చెబుతున్నాడు.
అభిషేక్ శర్మ దూకుడు వల్ల టీమిండియా టి20 లలో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తోంది. అభిషేక్ శర్మ నవ యువకుడు. అతడికి ఇంకా చాలా కెరియర్ ఉంది. క్రికెట్లో ఒక ఆటగాడు అద్భుతంగా ఆడుతుంటే.. ప్రశంసిస్తారు. అతడి స్థానాన్ని భవిష్యత్తు కాలంలో మరి ఎవరు భర్తీ చేస్తారు అనే చర్చ కూడా మొదలు పెడతారు. అభిషేక్ శర్మ విషయంలో కూడా ఇదే చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు ఆ చర్చకు సరైన సమాధానం లభించింది.
టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా ఏ, యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా ఏ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా 38 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత ఏ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (28) వేగంగా ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ నారాయణ జగదీశన్(104) సెంచరీ చేశాడు. ఆయుష్ బదోని (60) హాఫ్ సెంచరీ చేశాడు. ఫలితంగా భారత ఏ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
239 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన యూఎస్ఏ ఏ జట్టు 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అమెరికా జట్టులో గౌస్ (44), సంజయ్ కృష్ణమూర్తి (41) టాప్ స్కోరర్లు గా నిలిచారు. భారత జట్టులో రవి బిష్ణోయ్ మూడు, ఖలీల్ అహ్మద్, నమన్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. అశోక్ శర్మ, తిలక్ వర్మ, ఆయుష్ బదోని తలా ఒక వికెట్ సాధించారు.
టీమిండియా ఇన్నింగ్స్ లో జగదీషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 55 బంతులు ఎదుర్కొన్న అతడు 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో శివతాండవం చేశాడు. ఆర్యతో కలిసి తొలి వికెట్ కు 43, తిలక్ వర్మ తో కలిసి రెండు వికెట్ కు 113 పరుగులు, ఆయుష్ బదోని తో కలిసి మూడో వికెట్ కు 73 పరుగులు జోడించాడు. అతడు మైదానంలో ఉన్నంతసేపు బంతిని 360 డిగ్రీలు పరుగులు పెట్టించాడు. మరో అభిషేక్ శర్మ మాదిరిగా బ్యాటింగ్ చేశాడు. అందువల్లే టీం ఇండియా ఆస్థాయిలో స్కోర్ చేయగలిగింది.