మోడల్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నటి తాప్సీ పన్ను. ఢిల్లీలో పుట్టిన ఈ చిన్నది పదేళ్ల కిందట మంచు మనోజ్ సరసన ‘ఝుమ్మంది నాదం’తో టాలీవుడ్ ద్వారా తెరంగేట్రం చేసింది. లేలేత అందాలతో ఫస్ట్ మూవీలోనే ఆకట్టుకున్న ఆమె వరుసగా తెలుగు చిత్రాలు చేసింది. కానీ, మిస్టర్ పర్ఫెక్ట్ మినహా ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో, తాప్సీపై ఐరెన్ లెగ్ అనే ముద్ర పడింది. అటు తమిళ్, మలయాళంలో కూడా అదే పరిస్థితి ఉండడంతో బాలీవుడ్పై దృష్టి పెట్టిందామె. అక్షయ్ కుమార్ నటించిన ‘బేబీ’తో హిందీలో నిలదొక్కుకున్న తాప్సీ 2016లో వచ్చిన ‘పింక్’తో స్టార్డమ్ తెచ్చుకుంది. అప్పటి నుంచి పూర్తిగా బాలీవుడ్పైనే ఫోకస్ పెట్టిన ఆమె వరుస హిట్లతో దూసుకెళ్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఎదిగింది. వైవిధ్యమైన కథల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న తాప్సి బాలీవుడ్కు వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెబుతోంది. తాను కూడా నెపోటిజం (బంధుప్రీతి) బాధితురాలినే అంటోంది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్లో నెపోటిజానికి వ్యతిరేకంగా అనేక మంది గళం విప్పుతున్నారు. దీనిపై స్పందించిన తాప్సీ తాను కూడా బంధుప్రీతి కారణంగా ఇక్కట్లు పడ్డానని తెలిపింది. ‘ సినీ పరిశ్రమలో ప్రముఖుల వారసులుగా రంగ ప్రవేశం చేసిన వారికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వారికి సులభంగా అవకాశాలు వస్తాయి. కానీ, ఏలాంటి సినీ నేపథ్యం లేని వాళ్లకు ప్రముఖులతో పరిచయాలు అవడానికి చాలా కాలం పడుతుంది. దీంతో దర్శకులు కూడా బయటి నుంచి వచ్చే వారి బదులు తమకు పరిచయం ఉన్న ప్రముఖుల వారసులతో సినిమాలు చేయడానికే ఆసక్తి చూపుతారు. అలా మొదట్లో నేను పలు అవకాశాలను కోల్పోయా. వచ్చిన చాన్స్ చేజారినప్పుడు నేను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేను. మేం ఇలా బాధ పడడానికి ప్రేక్షకులు కూడా ఒకరకంగా కారణమే. ఎందుకంటే వాళ్లు కూడా వారసులు నటించిన సినిమాలనే ఆదరిస్తారు. ఇతరులను పట్టించుకునేందుకు సమయం తీసుకుంటారు’ అని తాప్సీ తనకు ఎదురైన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వివరించింది.