Evaru Meelo Koteswarulu: జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీలో ప్రసారమవుతున్న షో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’. ఇప్పటికే ప్రసారమవుతున్న ఈ షోను బుల్లితెర ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. అయితే సెలబ్రెటీలను తీసుకొస్తే మరింత హైప్ వస్తుందని భావిస్తున్న జూనియర్ ఎన్టీఆర్(NTR) తాజాగా ఇండస్ట్రీలోని తన మిత్రులను, స్టార్ సినీ ప్రముఖులను రప్పిస్తున్నారు.
ఇప్పటికే రాంచరణ్ ను పిలిపించి తొలి సెలబ్రెటీగా అతడితో కలిసి ‘ఎవరూ మీలో కోటీశ్వరులు’ గేమ్ ఆడారు. ఈ షో రక్తికట్టింది. వ్యూయర్ షిప్ బాగా వచ్చింది. ఇందులో రాంచరణ్ 25 లక్షలు గెలుచుకొని ‘చిరంజీవి ఐ, బ్లడ్’ బ్యాంకు చారిటీలకు ఇచ్చేశారు. ఇక రాంచరణ్ తర్వాత సోమవారం దిగ్గజ టాలీవుడ్ దర్శకులు రాజమౌళి, కొరటాల శివను ఎన్టీఆర్ రప్పించాడు. వారు కూడా బాగానే ఆడి అలరించారు.
ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu) వంతు వచ్చింది. ఇటీవలే మహేష్ బాబు మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పాలుపంచుకున్న కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మహేష్ తో షూటింగ్ పూర్తయినట్టు తెలిసింది.
కాగా మహేష్ బాబు వచ్చిన షోను దసరాకు ప్రసారం చేస్తారని సమాచారం. అయితే వచ్చినట్టు తెలుసు కానీ.. మహేష్ బాబు ఎలా ఆడారు? ఎంత గెలుచుకున్నాడన్నది మాత్రం ఇప్పటికీ బయటపడలేదు. తాజాగా అది లీక్ అయ్యింది.
ఎన్టీఆర్ హోస్ట్ గా మహేష్ తో పసందుగా గేమ్ ఆడారని.. మహేష్ బాబు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారని తెలిసింది. ఈ క్రమంలోనే 25 లక్షలు గెలుచుకున్నాడని సమాచారం. ఈ మొత్తాన్ని చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించే తన చారిటీకి విరాళంగా ఇవ్వనున్నట్టు మహేష్ బాబు చెప్పినట్టు తెలిసింది. సినీ.. ఇతర వ్యక్తిగత విషయాలపై ఎన్టీఆర్-మహేష్ లు సరదాగా ముచ్చటించుకుంటూ సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం రక్తికట్టిందని చెబుతున్నారు. దసరాకు ప్రసారమయ్యే ఈ షో కోసం ఇప్పుడు అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.