Group-4 Update: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 4 పోస్టులకు సంబంధించి మహిళలకు జీవో నంబర్ 3 ప్రకారం హారిజంటల్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈమేరకు వివరాలను వెల్లడించారు. వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
8,180 పోస్టులు..
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్–4 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్ 1, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్లో ఇతర అంశాలను మార్పు చేయలేదని స్పష్టం చేశారు. గత నెలలో గ్రూప్–4 ఫలితాలను ప్రకటించింది. త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలనకు వివరాలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
9.51 లక్షల దరఖాస్తులు..
గ్రూప్–4 ఉద్యోగాలకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2023, జూలై 1న ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించింది. పేపర్–1, పేపర్ – 2 రాత పరీక్ష నిర్వహించగా 7.6 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన తుదికీ అక్టోబర్ 6న టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. పేపర్ –1లో ఏడు, పేపర్ –2లో మూడు కలిపి మొత్తం పది ప్రశ్నలు తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. ఇందులో ఐదింటికి ఒకటికన్నా ఎక్కవ సమాధానాలు సరైనవిగా పేర్కొంది. తుది కీ ఆధారంగా అభ్యర్థులు జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కమిషన్ పూర్తి చేసింది.
గతంలో వర్టికల్ విధానం..
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వర్టికల్ విధానంలో పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి హారిజంటల్ విధానమే అమలు చేస్తామని ప్రకటించింది. వర్టికల్ విధానంతో మహిళలకు ఎక్కువ పోస్టుల వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఫలితాల ప్రకటనకు ఆటంకంగా మారింది. దీంతో వర్టికల్ విధానం తొలగించి హారిజంటల్ అమలుకు టీఎస్పీఎస్సీ నిర్ణయించి ఫలితాలు ప్రకటించింది.