High court verdict on extramarital relationship: పెళ్లంటే నచ్చి చేసుకునే కార్యం. భార్య అంటే మోయాలనిపించే బాధ్యత. భర్త అంటే నిండైన భద్రత. పిల్లలు ప్రేమకు గుర్తులు.. పెద్దలు మన తరానికి కర్తలు. భారతదేశం వసుదైక కుటుంబం లాగా సాగుతోందంటే దానికి ప్రధాన కారణం ఈ వ్యవస్థ ఉండడం వల్లే. మనదేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది కాబట్టి ఇప్పటివరకు భార్యాభర్తల మధ్య.. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి వివాదాలు వచ్చినా సరే పెద్దగా ఇబ్బందిగా ఉండేది కాదు. కొద్ది రోజులు మనస్పర్ధలు ఉండేవి. ఆ తర్వాత కుటుంబాలు కలిసిపోయేవి.
మన జీవితాల్లోకి ప్రపంచీకరణ ప్రవేశించడంతో కుటుంబ వ్యవస్థలు కూడా మారిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఒంటరిగా జీవించడం పెరిగిపోయింది. ఒంటరి కాపురాలు ఏర్పడటం ఎక్కువైంది. అందువల్లే చాలావరకు వృద్ధులు వృద్ధాశ్రమాలలో ఉంటున్నారు. పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. భార్యాభర్తలు క్షణం తీరికలేని పనులు చేస్తున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్లో ప్రేమకు ఆస్కారం లేదు. సాంగత్యానికి అవకాశం లేదు. అందువల్లే పండంటి సంసారాల్లోకి మూడవ వ్యక్తి ప్రవేశిస్తున్నాడు. ప్రేమ రాహిత్యం వల్ల భార్య లేదా భర్త మూడో వ్యక్తికి దగ్గరవుతున్నారు. దీంతో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. పిల్లలు ప్రేమకు దూరమవుతున్నారు. మూడో వ్యక్తి మాయలో పడి భార్య లేదా భర్త తమ జీవభాగస్వాములను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కుటుంబాలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.
కొన్ని సందర్భాలలో మూడవ వ్యక్తి వల్ల జరగరాని ఘటనలు జరుగుతున్నాయి. కొందరేమో మూడవ వ్యక్తి మాయలో పడి కోర్టు దాకా వెళ్తున్నారు. పెళ్లి చేసుకున్న వ్యక్తి లేదా మహిళ వల్ల ఇబ్బంది పడుతున్నామని.. తమకు నచ్చిన వ్యక్తితో జీవించే హక్కును ప్రసాదించమని కోర్టును కోరుతున్నారు. అలాంటిదే ఈ సంఘటన కూడా. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇది కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళలకు 19 సంవత్సరాలు. ఈమె భర్తకు 40 సంవత్సరాలు. పెద్దల ఒత్తిడితో పెళ్లి చేసుకుంది. ఆమెకు సంసార జీవితం అంత ఆసక్తిగా లేదు. దీంతో భర్త నుంచి విడిపోయి.. తనకు నచ్చిన భాగస్వామితో ఉండాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తన బాధను మధ్యప్రదేశ్ హైకోర్టు ఎదుట వ్యక్తం చేసింది. ఈ కేసు పూర్వాపరాలు విన్న హైకోర్టు.. కీలక తీర్పు చెప్పింది. మేజర్ అయిన వ్యక్తి తన ఇష్ట ప్రకారం ఉండవచ్చని.. అలా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ.. కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ జీవితం తనదని.. తనకు నచ్చినట్టుగా జీవించే హక్కు ఉందని ఆమె వారికి స్పష్టం చేసింది. కోర్టు కూడా ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో.. ఆమె మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోనుంది.