Adilabad Girl mysterious case: సరిగ్గా మూడు నెలల క్రితం ఆ అమ్మాయి చాలా బాగుంది. చలాకీగా ఉంది. తోటి స్నేహితులతో కలిసి ఆడి పాడింది. తరగతి గదిలో విపరీతమైన యాక్టివ్ గా ఉంది. అటువంటి ఆ బాలిక ఒక్కసారిగా మారిపోయింది. తోటి స్నేహితులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే ఆమె ఫోటో గోడకు వేలాడింది. అప్పటిదాకా సరదాగా కబుర్లు చెప్పిన ఆమె గత జ్ఞాపకమైంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తామ్సి మండల కేంద్రానికి చెందిన దేవనూరు సాయి లిఖిత అనే బాలిక ఎనిమిదవ తరగతి చదువుతున్నది. ఈ బాలిక నిజామాబాద్ జిల్లా పోచంపాడులోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. సరిగ్గా మూడు నెలల క్రితం లికిత అనారోగ్యానికి గురైంది. నాడు ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని పాఠశాల సిబ్బంది గుర్తించారు. డిసెంబర్ 8న ఈ సమాచారాన్ని ఆమె తల్లిదండ్రులకు అందించారు. దీంతో వారు ఆ బాలికను స్థానికంగా చూపించారు. ఆరోగ్యం స్థిమితంగా లేకపోవడంతో నేరుగా హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ ఆ బాలిక కు ట్రీట్మెంట్ ఇస్తుండగానే చనిపోయింది. డిసెంబర్ 16వ తేదీన ఆ పాప చనిపోయిన నేపథ్యంలో.. స్వగ్రామంలో ఖననం చేశారు.
బాలిక మృతి పై రకరకాల వదంతులు వినిపించాయి. మొదట్లో డెంగ్యూ వల్ల అని.. ఆ తర్వాత పచ్చకామెర్ల ప్రభావం వల్ల చనిపోయిందని ఇలా ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడేశారు. అయితే ఆ బాలిక చనిపోవడం పట్ల అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ బాలిక చదువుతున్న పాఠశాల వద్ద నిరసన తెలిపారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే నాడు నిజామాబాద్ జిల్లా మండోరా పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుహాసిని ఉన్నారు. ఇంత జరిగినప్పటికీ ఆమె సరిగా స్పందించలేదు. పైగా ఆందోళన చేస్తున్న తమను బలవంతంగా బయటికి లాగేశారని.. ఖననం చేయించేందుకు ఒత్తిడి తీసుకొచ్చారని ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు.
అయితే తమ కూతురు చనిపోవడం.. పోలీసులు సరిగా స్పందించకపోవడంతో మృతురాలి తల్లిదండ్రులు , కుటుంబ సభ్యులు నేరుగా నిజామాబాద్ సిపి సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు. రీ పోస్టుమార్టం చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సాయి చైతన్య సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సరిగా మూడు నెలల క్రితం ఖననం చేసిన మృతదేహాన్ని సంబంధిత వైద్య సిబ్బంది వెలికి తీశారు. అక్కడే ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఉన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది.
