ఎస్పీ బాలు అంటే తెలుగు పదానికి వెన్నని తేనె పలుకులను అద్దిన గాన గంధర్వడు. మధురమైన గీతాలకు ఆయన ప్రాణం పోశారు. తెలుగుతో పాటు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభై వేలకు పైగా పాటలు పాడిన ఏకైక మహా గాయకుడు బాలు. ఆయన లేని లోటు భారతీయ సినీ సంగీత ప్రపంచానికి ఎప్పటికీ ఉండి పోతుంది.
శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మరణం లక్షలాది ఆయన అభిమానులకు తీర్చలేని బాధ. సంగీత ప్రపంచానికి ఎప్పటికి తీర్చ లేని లోటు. అయితే, ఈ రోజు ఎస్పీ బాలు 75వ జయంతి సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు ఘన నివాళులర్పిస్తూ.. ఆయనతో తమకున్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..‘‘బాలుగారి గురించి మాట్లాడడానికి నాకు ఉన్న వయసు, అలాగే నా అనుభవం కూడా సరిపోదు. బాలుగారితో ఎక్కువ అనుబంధంతో మెలిగే అవకాశం నాకు దక్కలేదు. ఎందుకంటే నేను వెళ్లే సరికే బాలుగారు ట్రాక్ లు పాడి వెళ్లిపోవడం, లేదా ఆన్ లైన్లో ఆయన పాడి పంపించడం లాంటివి జరిగేవి. దాంతో ఆయనను ఎక్కువ కలవలేకపోయాను.
ఈ విషయంలో నేను రిగ్రెట్ గా ఫీలవుతున్నాను. నాకు బాగా గుర్తు. ‘అతడు’ సినిమాకు నాజర్ క్యారెక్టర్ కు బాలుగారితోనే డబ్బింగ్ చెప్పించాను. ఆ టైమ్ లో బాలుగారు కేవలం కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలకు మాత్రమే డబ్బింగ్ చెప్పేవారు. కానీ నేను అడిగేసరికి ఆయన నా కోసమే ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకున్నారు. ఆయన ఎంత సాధించినా చాలా సింపుల్గా ఉండేవారు. సినిమా క్రాఫ్ట్ మీద ఆయనకు ఉన్న అండర్ స్టాండింగ్ తోనే ఆయన అందరికంటే ఎంతో ప్రత్యేకంగా వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.