కరోనా మహమ్మారితో పోరాడుతూ ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కన్నుమూయడం ప్రతి ఒక్కర్ని కలిచివేసింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా కారణంగా మృతి చెందారు. కానీ టీఎన్ఆర్ మృతి పట్ల యావత్తు టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురి అయింది. ఆయన అకాల మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సైతం జీర్ణించుకోలేక సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.
“టీఎన్గారి మరణవార్త వినగానే షాక్ కి గురి అయ్యాను. ఆయన ఇంటర్వ్యూలను కొన్నిటిని చూశాను. ఇంటర్వ్యూల్లో అతిథులతో ఆయన మాట్లాడే తీరు అద్భుతం. వారి కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను” అని నాని ఎమోషనల్ ట్వీట్ చేశారు.
అలాగే విజయ్ దేవరకొండ పోస్ట్ చేస్తూ.. ‘మీతో నేను చేసిన రెండు ఇంటర్వ్యూలు నాకు ఇంకా గుర్తున్నాయి. మీరు చనిపోవడం మా ఇంట్లో అందరినీ కదిలించింది. మీ మాటలు, మీ ప్రేమ, సహనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మిస్ యూ సర్” అంటూ విజయ్ దేవరకొండ మెసేజ్ చేశాడు.
ఇక మంచు విష్ణుకి టీఎన్ఆర్ తో మంచి అనుబంధం ఉంది. కాగా మంచు విష్ణు పోస్ట్ చేస్తూ.. “మీ మరణం మాలో బాధను మిగిల్చింది. ఇది ఒక పీడకల. మంచి మనిషి. సంవత్సరం క్రితం ఆయనతో చేసిన ఒక ఇంటర్వ్యూ నా కెరీర్లో బెస్ట్ ఇంటర్వ్యూగా నిలిచింది. ఆయన సన్నిహితులకు నా సంతాపం’ అంటూ మంచు విష్ణు పోస్ట్ చేశారు.
ఇది ఇప్పటికీ నమ్మలేని వార్త. నా స్నేహితుడు టీఎన్ఆర్ ఇక లేరనే వార్త జీర్ణించుకోవడం నాకు కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. కరోనా కాస్తయినా దయ చూపించు. ఇక మా వల్ల కాదు. అంటూ డైరెక్టర్ మారుతి వెరీ ఎమోషనల్ ట్వీట్ చేసారు.
మీ ఆకస్మిక మరణం మా మనసులను కలచివేస్తోంది. మృదువైన మాటతీరు గల మనిషి మీరు. మిస్ యూ సర్. మీ కుటుంబానికి నా సానూభూతి అని అనిల్ రావిపూడి మెసేజ్ చేశారు. అలాగే మరో డైరెక్టర్ గోపీచంద్ మలినేని ‘టీఎన్ఆర్ గారు లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబానికి నా సానుభూతి’ అని ట్వీట్ చేశారు.
ఇక విస్మయానికి గురయ్యాను. మిస్ యూ టీఎన్ఆర్గారు. – సందీప్ కిషన్ పోస్ట్ చేయగా, మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఈషా రెబ్బ ఎమోషనల్ అయింది. సునీల్ కూడా బాధగా ట్వీట్ చేస్తూ ‘టీఎన్ఆర్ గారు ఇక లేరన్న వార్త వినడం నిజంగా బాధ కలిగించింది. విచారంగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి అని సునీల్ మెసేజ్ చేశారు.