Shiva Ratan: కష్టపడే తత్వం.. సాధించాలనే తాపత్రయం.. ఉంటే ఎవరైనా సరే గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే పడే కష్టంలో నిజాయితీ ఉంటే.. ఏదైనా సరే కాళ్ళ దగ్గరికి వస్తుంది. మనల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. మనదేశంలో పేరుపొందిన వ్యాపారవేత్తలు.. నాయకులు కష్టపడి పైకి వచ్చినవారే. అటువంటివారిని మన సమాజం ఆమోదిస్తుంది. గౌరవిస్తుంది. అవసరమైతే నెత్తిన పెట్టుకుంటుంది. ఈ జాబితాలో ఈయన మొదటి స్థానంలో ఉంటారు.
అది రాజస్థాన్ రాష్ట్రం. బికనీర్ ప్రాంతం. ఈ ప్రాంతం మొదటి నుంచి కూడా స్వచ్ఛమైన మిఠాయిలకు పెట్టింది పేరు. ఆవు పాలు.. నాణ్యమైన నెయ్యి.. మిఠాయిలు తయారు చేయడంలో నేర్పరితనం.. స్నాక్స్ రూపొందించడంలో అనుభవం ఇక్కడ ప్రజల సొంత. సాధారణంగా ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ ఉన్న వనరులను వినియోగించుకొని ఇక్కడి ప్రజలు మెరుగైన జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అలాగని ఇక్కడ పేదరికం లేదనుకోవద్దు. పేదలు ఇతర వ్యక్తుల వద్ద పనిచేస్తుంటారు. తమ జీవితాన్ని ఏదో విధంగా నెట్టుకొస్తూ ఉంటారు. అటువంటి పేద కుటుంబాల్లో జన్మించాడు శివ్ రతన్. 75 సంవత్సరాల వయసులో ఆయన గురువారం కన్నుమూశారు. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ.. చిన్న చిన్న పనులు చేస్తూ ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువు ముందుకు సాగే అవకాశం లేకుండా పోయింది. దీంతో తాను మిఠాయి షాపులలో పనిచేసిన అనుభవాన్ని వ్యాపారంగా మార్చుకున్నాడు. 1986లో చిన్న పెట్టుబడితో శివదీప్ ప్రొడక్ట్స్ పేరుతో స్నాక్స్, స్వీట్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. మొదట్లో వ్యాపారం అంత గొప్పగా సాగలేదు. ఆ తర్వాత ఆ వ్యాపారాన్ని సరికొత్త దిశగా మళ్ళించాడు రతన్. దీంతో అతడు అనుకున్నట్టుగానే వ్యాపారం వృద్ధిలోకి వచ్చింది.
1993లో తన కంపెనీని బికాజి ఫుడ్స్ ఇంటర్నేషనల్ గా మార్చాడు. స్నాక్స్, స్వీట్స్ లో సరికొత్త రుచులను అందించడం మొదలుపెట్టాడు. మార్కెట్ వ్యూహాలను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నాడు. క్రమక్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు. ఏకంగా 13 వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు.
తనతో మొదలైన ఈ వ్యాపారం.. తన భార్యతో కలిసి ఇద్దరికి చేరింది.. తర్వాత ఆ సంఖ్య పదికి పెరిగింది. ఇలా క్రమక్రమంగా వందల సంఖ్యను దాటి వేలకు చేరుకుంది. బికాజి ఫుడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో వందల రకాల ఉత్పత్తులు తయారవుతున్నాయి. మనదేశంలోనే కాదు.. ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. కేవలం వ్యాపారం ద్వారానే రతన్ ఆగిపోలేదు. తన గ్రామంలో సేవా కార్యక్రమాలు సాగించాడు. చదువు లేని వారికి చదువు చెప్పించాడు. గ్రామంలో రోడ్లు వేయించాడు. సామాజిక హిత కార్యక్రమాలను అనేకం చేపట్టాడు..
శివ రతన్ ఇప్పుడు చనిపోయి ఉండవచ్చు. కానీ ఆయన వేసిన తోవ అలానే ఉంది. చూపించిన మార్గం గొప్పగా కనిపిస్తోంది. ఎందుకంటే అతడు సృష్టించింది కేవలం వ్యాపారం మాత్రమే కాదు.. అంతకు మించిన సామ్రాజ్యం. ఈ భూమి మీద చాలామంది పుడతారు. కానీ కొందరు మాత్రమే ఆ పుట్టుకకు సార్ధకతను కలిగిస్తారు. అందులో రతన్ శిఖర స్థానంలో ఉంటాడు.