Charanjit Kaur Story: మన దేశంలో టాటా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మనదేశంలోనే కాదు.. గ్లోబల్ వ్యాప్తంగా టాటా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఉప్పు నుంచి మొదలుపెడితే ఉక్కు వరకు వ్యాపారాలు చేస్తూ లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉంది. అటువంటి టాటా కంపెనీకి ఒక మహిళ తాను తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముతోంది.. అంతేకాదు ప్రతినెల దండిగా ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు.. ఆమె కథ ఏంటంటే..
అది పంజాబ్ రాష్ట్రం. లుధియానా లోని భగవాన్పుర గ్రామం.. ఈ క్రమంలో చరణ్ జీత్ కౌర్ అనే మహిళ ఉంది. ఈమెకు 54 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి కూడా ఈమె ది పేదరికమే. రెక్కలు ముక్కలు చేసుకొని కూలి పనులకు వెళితే అంతగా ఆదాయం వచ్చేది కాదు. పేదరికం వల్ల ఎనిమిదవ తరగతి మధ్యలోనే వదిలి పెట్టాల్సి వచ్చింది. అయితే ఈమెకు కుటుంబాన్ని పోషించుకోవాలని మొదటి నుంచి కూడా బలమైన కోరిక. పిల్లల్ని బాగా చదివించుకోవాలని.. ఆర్థికంగా స్థిరపడాలని ఉండేది.
ఎనిమిదో తరగతి మధ్యలోనే డ్రాప్ అవుట్ కావడంతో ఈమె మిషన్ కుట్టడంలో శిక్షణ పొందింది. తన మిషన్ మీద జనపనార సంచులను ఎలా కుట్టాలో కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందింది. తన నైపుణ్యాలను పెంపొందించుకుంది. ఆ తర్వాత వ్యాపారంలో మరింత అవగాహన ఏర్పరచుకుంది. భారీగా కాకుండా.. చిన్నచిన్నగా వ్యాపారాన్ని మొదలుపెట్టింది. మొదట్లో తన వ్యాపారం అనుకున్నంత సాఫీగా సాగిపోలేదు. కొన్నిసార్లు ఆర్డర్లు కూడా వచ్చేవి కావు. ఆర్థికంగా ఇబ్బంది పడింది.
ఈ దశలో తన వ్యాపారాన్ని మెల్లమెల్లగా గాడిలో పెట్టుకుంది. పలు మీడియా సంస్థలు ఆమె గురించి ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. దీంతో ఆర్డర్లు మెల్లమెల్లగా పెరిగాయి. వ్యాపారం విస్తరించింది.. టాటా తో పాటు జోన్టి, అగ్రి వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పుడు ఏకంగా నెలకు 50 వేలకు మించి సంపాదించుకునే స్థాయికి పెరిగింది. సాధారణ ప్రజలు కూడా ఆమె దగ్గర సంచులు కొనుగోలు చేస్తుంటారు.
చెప్పిన సమయానికి అంటే ముందుగానే ఆర్డర్లు ఇవ్వడం ఆమె గొప్పతనం. వస్తున్న ఆదాయంతో కుటుంబాన్ని మెరుగుపరచుకుంది. స్థానిక రైతుల దగ్గర ఆమె జనపనార కొనుగోలు చేస్తూ ఉంటుంది. తద్వారా అక్కడ రైతులకు కూడా ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. ఎనిమిదవ తరగతి మధ్యలో డ్రాప్ ఔట్ కావడం.. జనపనార సంచులు కుట్టి ఈ స్థాయి దాకా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఎంతైనా ఆడవాళ్లు ఆడవాళ్లే. ఎటువంటి సమస్యలైనా సరే వారి ముందు దిగదుడుపే.
