Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే పైచేయిగా ఉండాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆఫ్రోడ్ ఎస్యూవీ కాన్సెప్ట్ ను రూపొందించింది. దీనిని ఇటీవల ప్రపంచానికి పరిచయం చేయగా భారతదేశంలో పేటెంట్ లభించింది. దీంతో భవిష్యత్తులో ఈ మోడల్ను ఉత్పత్తిలోకి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు వేగవంతం చేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ మహీంద్రా తీసుకువచ్చే కొత్త కారు ఏదీ? ఇది ఎలా ఉండబోతుంది?
మహీంద్రా త్వరలో Vision.T అనే కొత్త ఎస్ యూవీని తీసుకురాబోతుంది. ఇది భవిష్యత్ తరానికి అందించే ఎలక్ట్రిక్ ఆఫ్రోడ్ ఎస్యూవీ కాన్సెప్ట్. బలమైన బాక్సీ డిజైన్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, భారీ వీల్ ఆర్చ్లు, దృఢమైన బంపర్లు, ఆధునిక LED లైటింగ్తో ఈ వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అడ్వెంచర్, ఆఫ్రోడ్ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది.
Vision.T కి సంబంధించి డిజైన్ పేటెంట్ లభించడం వల్ల వాహనం బాహ్య ఆకృతిపై మహీంద్రాకు చట్టపరమైన హక్కులు లభిస్తాయి. ఇతర సంస్థలు ఇదే తరహా డిజైన్ను అనుమతి లేకుండా ఉపయోగించకుండా ఇది రక్షణ కల్పిస్తుంది. అయితే పేటెంట్ రావడం అంటే వెంటనే మార్కెట్లోకి వస్తుందనే అర్థం కాదు. ఉత్పత్తి దశకు వెళ్లే ముందు కంపెనీ తుది రూపకల్పనలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది.
Vision.Tలో పూర్తి డిజిటల్ కాక్పిట్, పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఓవర్-ది-ఎయిర్ అప్డేట్స్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ , 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉండే అవకాశముందని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. మహీంద్రా ఇప్పటికే తన కొత్త తరం ఎలక్ట్రిక్ వాహనాల కోసం INGLO అనే ప్రత్యేక EV ప్లాట్ఫారాన్ని అభివృద్ధి చేసింది. Vision.T కూడా ఇదే ప్లాట్ఫారంపై రూపొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్లాట్ఫారం వల్ల మెరుగైన రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్, అధిక పనితీరు లభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం Vision.T కాన్సెప్ట్ మోడల్ మాత్రమే. భారతదేశంలో డిజైన్ పేటెంట్ లభించినప్పటికీ, దీని ఉత్పత్తి వెర్షన్ ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై మహీంద్రా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే రాబోయే సంవత్సరాల్లో కంపెనీ ఎలక్ట్రిక్ SUV శ్రేణిలో ఇది కీలక మోడల్గా మారే అవకాశముందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
