YSRCP will win 200 seats: ‘ఆలూ లేదు చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు’ ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఓటమి నుంచి చేరుకొని.. ప్రజా పోరాటాలు చేసి.. ప్రజలకు దగ్గరైన రీతిగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఏకంగా ఏపీలో తమకు 200 స్థానాలు వస్తాయని ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఉన్నవే 175 అసెంబ్లీ సీట్లు అయితే.. 200 సీట్లు ఎలా సాధ్యం? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. అయితే నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీలో 225 అసెంబ్లీ సీట్లు అవుతాయి. అందులో 200 స్థానాలు వైసీపీ వే అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే ఆయనకు తెలియదు కానీ పునర్విభజన జరిగిన ప్రతిసారి అధికార పార్టీయే గెలుస్తోంది. 2009లో రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అలా గట్టెక్కిందే.
ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు..
ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ 11 స్థానాలకు మాత్రం పరిమితం అయింది. 164 సీట్లలో కూటమి ఏకపక్ష విజయం సాధించింది. కానీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలానికే కూటమి పట్ల ప్రజా వ్యతిరేకత మొదలైందని.. ఇక తమదే విజయమని చెబుతోంది వైసిపి. అయితే విశ్వాసం ఉండవచ్చు కానీ అతి విశ్వాసం ఉండకూడదు. గెలుస్తాం అనడంలో తప్పులేదు గాని ఎగిరేసుకుపోతాం అన్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దుస్థితి. ఎందుకంటే ఆ పార్టీ మనుగడకే ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అటువంటిది ఏకపక్ష విజయం సాధిస్తాం అని చెప్పడం మాత్రం కొంచెం అతి అనిపిస్తోంది.
పునర్విభజనతో పెరగనున్న నియోజకవర్గాలు..
నియోజకవర్గాల పునర్విభజనతో 225 స్థానాలు జరిగితే గెలుస్తాం అన్నది సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjan Ramakrishna Reddy ) ప్రకటన సారాంశం. వస్తున్న ఏప్రిల్ నుంచి జనగణన మొదలుకానుంది. అది పూర్తయిన తర్వాత కుల గణన ప్రారంభం కానుంది. అటు తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అని వైసిపి అంచనా వేస్తోంది.. ఒకవేళ పునర్విభజన జరిగితే కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగు దేశానికి ఫేవర్ గా ఉంటుంది. తెలుగుదేశం కూటమి కూడా నియోజకవర్గాల పెంపును కోరుతోంది. కూటమిలో మిగిలిన నేతలకు సర్దుబాటు చేసే వీలుగా 50 అసెంబ్లీ సీట్లు అధికంగా వస్తాయి. అప్పుడు నేతల మధ్య ఎటువంటి పోటీ ఉండదు.. ముఖ్యంగా వైసీపీకి బలమైన నియోజకవర్గాలను విభజన ద్వారా వేరు చేసే అవకాశం అధికార పార్టీకి రానుంది. అయితే విపక్ష పార్టీగా పునర్విభజనపై ఆశలు పెట్టుకుంది వైసిపి. 2019 ఎన్నికలకు మాదిరిగా వన్ సైడ్ వేవ్ ఉంటుందని భావిస్తోంది. అయితే మునుపటిలా టిడిపి చాన్స్ ఇవ్వదు. ఆపై మూడు పార్టీల పొత్తు అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్. కూటమికి ప్లస్. అయితే ఏదో మాట్లాడాలని సజ్జల రామకృష్ణారెడ్డి అటువంటి ప్రకటన చేసి ఉంటారు తప్ప అందులో ఎంతవరకు సాధ్యం కాదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.