YSRCP: గెలిస్తే నా చరిష్మ. ఓడిపోతే మీ కర్మ అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి వైఖరి. స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే ఒక రకమైన భారం. అటువంటిది ఆ ఎన్నికల్లో పోటీ చేయండి అన్న వరకు ఓకే. కానీ పార్టీ అభ్యర్థులు బరిలో లేకపోతే.. కూటమికి అనుకూలంగా ఏకగ్రీవాలు అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని చెప్పడం మాత్రం సహేతుకం కాదు. దీనిని కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పులివెందులలో పట్టు బిగిస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి.. కచ్చితంగా అక్కడ ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏడాది కిందట జరిగిన పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వచ్చింది. పోనీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది అనుకుందాం. కానీ దశాబ్దాల వైయస్సార్ కుటుంబం ముద్ర ఏమయింది. వారికి ప్రజాబలం ఉంటే.. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ వర్క్ అవుట్ అయ్యేది కాదు కదా. పోనీ ప్రజలకు ప్రలోభాలు పెట్టారు అనుకుందాం. అంటే ప్రలోభం పెడితే అభిమానులు కూడా మారిపోతారా? అలా మారిపోయిన అభిమానాన్ని ఏమనాలి?
* ఆ ఆలోచన సరే..
మున్సిపల్ చైర్మన్ ల తో పాటు మేయర్లకు ప్రత్యక్ష ఎన్నిక అనేది కూటమి ప్రభుత్వ ఆలోచన. అయితే బలమైన అభ్యర్థులను బరిలో దించి గెలవాలన్నది వైసీపీ అధినేత జగన్ ఆలోచన. అందులో ఎంత మాత్రం తప్పులేదు. అయితే ప్రత్యక్ష ఎన్నిక కాకుండా పరోక్ష ఎన్నిక జరిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి. పరోక్ష ఎన్నికలు అయితే స్థానిక సంస్థల ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించేదా?.. తప్పకుండా కూటమి టీం వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఆ మూడు పార్టీలకు జగన్ భయం ఉంది.. మళ్లీ జగన్ వస్తారు అన్న ఆందోళన ఉంది. అందుకే కసితో పని చేస్తాయి ఆ మూడు పార్టీలు. అయితే ఆ కసి వైసీపీలో కనిపించాలి అనేది జగన్ ఆలోచన. అయితే పులివెందుల మున్సిపాలిటీని కూటమి నేతలు విడిచిపెట్టరు. జగన్మోహన్ రెడ్డి ఎంత టైట్ చేస్తే.. పులివెందులలో అంత పట్టు బిగిస్తుంది కూటమి.
* ప్రతికూల ఫలితాలు వస్తే..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆందోళనతో గడుపుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల కంటే ఇప్పుడు ఆ పార్టీ గ్రాఫ్ మరింత తగ్గింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఉన్న క్యాడర్ కూడా చేజారిపోతుంది. అదే సమయంలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోతే ఆ పార్టీలో స్థైర్యం కచ్చితంగా దెబ్బతింటుంది. అందుకే ఎక్కడ ఏకగ్రీవాలకు తావివ్వకూడదని.. అభ్యర్థులను తప్పనిసరిగా నిలబెట్టాలని హెచ్చరికలు జారీ చేయాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఎన్నికల సరళి పార్టీకి ఏమాత్రం ప్రతికూలంగా మారినా.. ఓటమి నిందను తప్పించుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం అనే సాకును జగన్ ఇప్పుడే సిద్ధం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఎదురైన మరుక్షణం.. పంచాయితీతో పాటు ప్రాదేశిక ఎన్నికలను జగన్ కచ్చితంగా బహిష్కరించే అవకాశం ఉంది. అయితే అది మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం కూటమికి దక్కితే.. ప్రభుత్వ యంత్రాంగం పనితీరును ఆక్షేపిస్తూ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం ఖాయం అని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..