YS Jagan Mohan Reddy Hyderabad: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy)రూటు మార్చినట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు నుంచి తిరిగి రావాలని భావిస్తున్నారు. అయితే శాశ్వతంగా తాడేపల్లిలో నివాసం ఉండేందుకు కాదు. ఆయన ఈసారి బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతారని తెలుస్తోంది. బెంగళూరు నుంచి చేసే రాజకీయాలు ఆశించిన స్థాయిలో ఫలప్రదం కాకపోవడంతో.. తనకు కలిసి వచ్చిన హైదరాబాదు లోటస్ ఫండ్ కు షిఫ్ట్ అవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు నుంచి తాడేపల్లి కి షటిల్ సర్వీసులు నడుపుతున్నారని జగన్మోహన్ రెడ్డి పై రాజకీయ ప్రత్యర్థుల ఆరోపిస్తున్నారు. బెంగళూరు వేదికగా రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అవి ప్రజల్లోకి వెళుతుండడంతోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరు నుంచి నివాసం మార్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
* ఉమ్మడి రాష్ట్రంలో..
కాంగ్రెస్ పార్టీని విభేదించి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం కావడంతో హైదరాబాద్ నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించారు. అలా లోటస్ ఫండ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంగా మారింది. అక్కడ నుంచి పార్టీ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. చాలా దూకుడుగా రాజకీయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని విభేదించి ఏకంగా ఉప ఎన్నికలకు వెళ్లారు. తిరుగులేని విజయం సాధించారు. ఆ తరువాత ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చారు. 2014లో ప్రతిపక్షంలోకి వచ్చినా ఎక్కువగా లోటస్ ఫండ్ ను విడిచిపెట్టలేదు. అక్కడి నుంచి రాజకీయ వ్యూహాలు అమలు చేశారు. విజయవంతం అయ్యాయి. అటు సెంటిమెంట్ గా వర్క్ అవుట్ అయ్యాయి.
* అప్పట్లో లోటస్ ఫండ్ నుంచి..
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాదు నుంచి రాకపోకలు సాగించేవారు. లోటస్ ఫండ్ సెంటిమెంటు బాగానే వర్కవుట్ అయింది. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితం అయ్యారు. కనీసం అటు హైదరాబాద్ కానీ.. ఇటు బెంగళూరు ముఖం చూసేవారు కాదు. అయితే ఎప్పుడైతే అధికారం కోల్పోయారో 2024 ఎన్నికల ఫలితాలు అనంతరం ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారు. సాటి తెలుగు రాష్ట్రం కంటే కన్నడ నేల ఆయనకు ప్రధానంగా మారిపోయింది. దీంతో రాజకీయ ప్రత్యర్థులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు దూరంగా ఉండడంతో వ్యూహాలు అమలు చేయలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లోటస్ ఫండ్ నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తే సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుందని పొలిటికల్ పండితులు ఆయనకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో బెంగళూరు నుంచి ఆయన హైదరాబాద్ మకాం మార్చడం ఖాయమని సమాచారం. లోటస్ పండ్ లో ఒక విభాగంలో షర్మిల ఉన్నారు. మరో విభాగంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగనున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో పాటు పవన్ హైదరాబాదు నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో రాజకీయ విమర్శలు కూడా ఉండవని భావిస్తున్నారు.
