AP Volunteers: ఏపీలో ఇప్పుడు వాలంటీర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. వారితోనే గట్టెక్కాలని వైసీపీ భావిస్తోంది. వారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రచారంలోకి రావాల్సిందేనని వైసీపీ నేతలు హెచ్చరికలు జారీచేస్తున్నారు. అయితే పార్టీపై అభిమానం ఉన్నవారు నేరుగా రాజీనామాలు చేస్తున్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో రాజకీయాలతో సంబంధంలేని చాలామంది వాలంటీర్లు రాజీనామా చేసేందుకు రావడం లేదు. దీంతో అటువంటి వారిపై వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. తప్పకుండా రాజీనామా చేసి వైసిపి కండువాలు కప్పుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టెక్కలి వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇదే మాదిరిగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించింది. ఇంటర్వ్యూలు, వ్యక్తిగత పనితీరు పేరిట ఎంపిక జరిగినా.. దాదాపు వారంతా వైసీపీ సానుభూతిపరులే. అయితే నగరాలు, పట్టణాల్లో నియమితులైన వారిలో..రాజకీయాలతో సంబంధం లేని వారు ఉన్నారు. అటువంటివారు రాజీనామాలు చేయలేదు. మిగతావారు రాజీనామా చేసినా.. వారు చేసేందుకు ముందుకు రాలేదు. ఇది వైసీపీ నేతలకు మింగుడు పడని విషయంగా మారింది. వాలంటీర్ పోస్ట్ కు రాజీనామా చేసి.. వైసీపీ కండువా కప్పుకొని.. పార్టీకి మద్దతుగా ప్రచారం చేసి.. ఎన్నికల ప్రక్రియలో సహకరించిన వారికి మాత్రమే వాలంటీర్ పోస్టులు ఉంటాయని నేరుగా వైసీపీ నేతలే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో వాలంటీర్లకు పాలు పోవడం లేదు.
తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల వేతనం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా వాలంటీర్లలో మార్పునకు కారణం. రాజీనామా చేసేందుకు ముందుకు రాకపోవడానికి కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలుత చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ పై అనుచిత వ్యాఖ్యలు చేసినా.. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయనలో మార్పు కనిపిస్తోంది. అందుకే వాలంటీర్లను కొనసాగిస్తామని.. వారి వేతనాన్ని పెంచుతామని ఏకంగా మేనిఫెస్టోలో పొందుపరిచారు. వాలంటీర్లలో తటస్థ వర్గాన్ని చంద్రబాబు ఆకర్షించగలిగారు. ఇది వైసీపీ నేతలకు సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. వాలంటీర్ పోస్టులను తాము ఇప్పిస్తే.. రాజీనామా చేయకుండా ఉండిపోవడాన్ని వైసిపి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.అందుకే దువ్వాడ శ్రీనివాస్ లాంటి నేతలు నేరుగానే వాలంటీర్ల పై మాట్లాడుతున్నారు. కేవలం రాజీనామా చేసిన వారికి మాత్రమే వాలంటీర్ పోస్టులు ఉంటాయని.. రాజీనామా చేయని వారి పోస్టులను జూన్ 3 తర్వాత తొలగిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తుండడం విశేషం.