Visakhapatnam Resort Incident: అది విశాఖపట్నం పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం పంచాయతీ.. ఈ ప్రాంతంలో లక్కీ అనే పేరుతో ఒక రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్ లో దువ్వలపాలెం ప్రాంతానికి చెందిన బమ్మిడి పైడయ్య ఇక్కడ వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.
మంగళవారం తెల్లవారుజామున అతడు రక్తపు మడుగులో ఉన్నాడు. ఆ రిసార్ట్లో పని చేసే హౌస్కీపింగ్ సిబ్బంది వచ్చి చూసేసరికి అతడు అచేతనంగా ఉన్నాడు. మరొక గదిలో ఒక యువకుడు మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైడయ్యను ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్న యువకుడిని పోలీసులు విచారించగా అసలు నిజం బయటపెట్టాడు.
విశాఖపట్నంలో పూర్ణ మార్కెట్ ప్రాంతంలో ఓ దుస్తుల దుకాణంలో ఓ యువతీ పని చేస్తూ ఉంటుంది. ఈమె గనగల గణేష్ అనే యువకుడితో ప్రేమ కొనసాగిస్తోంది. ఇతడి పుట్టిన రోజు కావడంతో అయువతి రిసార్ట్ ను అద్దెకి తీసుకొంది. గణేష్ తో పాటు.. మరి కొంతమందిని అక్కడికి తీసుకెళ్లింది. వారిలో ముగ్గురు యువతులు ఉన్నారు. పదిమంది దాకా యువకులు ఉన్నారు. వీరంతా కూడా మద్యం తాగారు. అర్ధరాత్రి పూట గణేష్ తో కేక్ కట్ చేయించారు. మద్యం మత్తులో ఉన్న వీరు తెల్లవారుజామున నాలుగు గంటలకు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో రిసార్ట్లో ఉన్న సీసీ కెమెరాలు.. టీవీలను.. ఇతర సామాగ్రి మొత్తం ధ్వంసం చేశారు. దీంతో వాచ్మెన్ పైడయ్య వారితో గొడవపడ్డాడు.
తాగిన మైకంలో ఉన్నవారు బీరు సీసాలను పగలగొట్టి పైడయ్య మీద తీవ్రంగా దాడి చేశారు. అతని ముఖం మీద.. శరీరం మీద తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతడు అచేతన స్థితిలో పడిపోయాడు. గణేష్ తాగిన మైకంలో అడుగు కూడా బయట పెట్టలేని స్థితిలో ఉన్నాడు. దీంతో ఆ యువతి అతడిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది.. పోలీసులు విచారణ నిర్వహించడంతో గణేష్ అసలు విషయం చెప్పాడు. దీంతో పార్టీలో పాల్గొన్న వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే తాగిన మైకంలో ఆ పార్టీకి వచ్చిన వారంతా ఇష్టానుసారంగా ప్రవర్తించారని.. కొంతమంది యువతులు తాగి వీరంగం చేశారని అక్కడి దృశ్యాలను బట్టి తెలుస్తోంది. పైడయ్యకు తీవ్రంగా గాయాలు కావడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.