Visakhapatnam horror: మీకు గుర్తుందా.. కొన్ని నెలలక్రితం ఢిల్లీలో ఓ యువతి తన ప్రేమికుడితో సహజీవనం మొదలుపెట్టింది. ఇది తప్పని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ ఆమె వినిపించుకోలేదు. పైగా ప్రేమ మైకంలో మునిగి ఇంట్లో వాళ్లతో గొడవ పడింది. అతడితో వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు కేసులు పెట్టినప్పటికీ పోలీసుల ఎదుట తాను మేజర్ నని.. తనకు స్వేచ్ఛగా ఆలోచించుకునే అవకాశం ఉందని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
అలా తన వద్దకు వచ్చిన ఆ ప్రేమికుడు ఆమెకు చుక్కలు చూపించడం మొదలు పెట్టాడు. ఆమెను బయటకు వెళ్లనిచ్చేవాడు కాదు. ఫోన్ లాక్కున్నాడు. సోషల్ మీడియా ఖాతాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆమెను శరీర అవసరాలు తీర్చే బానిసను చేశాడు. అనేకమార్లు గొడవపడ్డాడు. తీవ్రంగా కొట్టి చంపాడు. శరీరాన్ని ముక్కలుముక్కలు చేసి ప్రిడ్జ్ లో పెట్టాడు. ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో ఆమె శరరీభాగాలను పడేశాడు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
సరిగ్గా ఇలాంటి సంఘటనే ఏపీ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పెళ్లయిన వాడిని ప్రేమించి.. అతడి ప్రేమలో మునిగిపోయి ఓ అమ్మాయి తనజీవితాన్ని నాశనం చేసుకుంది. విశాఖపట్టణంలో జరిగిన ఈ సంఘటన సమాజంలో అమ్మాయిలకు ఓ గుణపాఠం లాగా మారింది.
విశాఖ నగరానికి చెందిన మౌనిక(29)ఉన్నత విద్యావంతురాలు. మౌనిక నేవీలో పని చేస్తున్న రవీంద్రతో ప్రేమలో పడింది. అతడికి అప్పటికే పెళ్లయింది. అతడు చెప్పిన మాయమాటలు నమ్మింది. అతడికి పూర్తిగా లొంగిపోయింది. అతడు ప్రేమపేరుతో మౌనిక ను పూర్తిగా వశపరుచుకున్నాడు. అతడి ప్రేమను నిజమని భావించిన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. దీనికి రవీంద్ర దాట వేస్తూ వచ్చాడు. ఇటీవల మౌనిక రవీంద్రను గట్టిగా నిలదీయడంతో అతడిలో కోపం పెరిగిపోయింది. ఎలాగైనా సరే మౌనిక అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈలోగా రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇదే అదునుగా భావించిన రవీంద్ర మౌనికను తన ఇంటికి రప్పించుకున్నాడు. ఆమెతో శారీరక సుఖాన్ని పొందాడు. పెళ్లి విషయంలో ఇద్దరికీ మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆవేశం తట్టుకోలేక రవీంద్ర ఆమెను చంపేశాడు. ఆతర్వాత ఆమె శరీరభాగాలను పదునైన కత్తితో ముక్కలు చేశాడు. ఆ ముక్కలను ప్రిడ్జ్ లో పెట్టాడు. అనంతరం స్థానిక ఠాణాకు వెళ్లి పోలీసులకు జరిగిన విషయం చెప్పాడు. వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ ఉదంతానికి సంబంధించి మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా మౌనిక, రవీంద్రకు పరిచయం ఏర్పడింది. అది వారి మధ్య సంబంధానికి దారితీసింది. రవీంద్ర ఇప్పటి వరకు మౌనికు రూ.3.50 లక్షల వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రవీంద్ర పోలీసులతో చెప్పాడు. మరో వైపు నేవీ ఐడీ కార్డు తీసుకుని డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో తాను చంపానని రవీంద్ర పోలీసుల ఎదుట అంగీకరించినట్టు సమాచారం. మౌనిక అడ్డు తొలగించుకోవడానికి రవీంద్ర ముందుగానే ఆన్ లైన్ లో పదునైన కత్తి, క్లీనింగ్ సామగ్రి కొనుగోలు చేశాడు.