Nara Lokesh IT Projects: విశాఖలో( Visakhapatnam) ఐటీ రంగ విస్తరణ పై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో దిగ్గజ పరిశ్రమ, సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖకు మరో దిగ్గజ సంస్థ వచ్చేందుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. విశాఖ పై క్యాప్ జెమినీ దృష్టి పెట్టినట్లు సమాచారం. విశాఖలో క్యాప్ జెమినీ సీఈవో ఐ మాన్ ఇజ్జత్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఐటీ రంగ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల సృష్టి పై విస్తృతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా నారా లోకేష్ విశాఖలో ఏర్పాటు కాబోయే సంస్థలు, రాబోయే అనుబంధ విభాగాల గురించి వివరించినట్లు సమాచారం. దీంతో విశాఖలో క్యాప్ జెమినీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: వైసిపి చేతికి ‘ఆమె’ కొత్త బాణం!
* సమగ్రంగా వివరించిన మంత్రి లోకేష్..
ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ( Google data centre) విశాఖలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే దాని ఏర్పాటు వెనుక జరిగిన కృషిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం డేటా పాలసీ మార్చేందుకు సిద్ధపడినట్లు గుర్తు చేశారు. మరోవైపు కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వంటి సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాలని కూడా గుర్తు చేశారు. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో విశాఖకు భారీగా పెట్టుబడులు రానున్నాయని కూడా వారితో చెప్పినట్లు సమాచారం. దేశంలో అరుదుగా కనిపించే సమగ్ర ఐటి ఎకో సిస్టం విశాఖలో ఏర్పడుతోందని ఆయన వివరించారు. అందుకే క్యాప్ జెమినీని పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఒకవేళ క్యాప్ జెమినీ విశాఖకు వస్తే సుమారు 20వేల మందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, క్లౌడ్ సర్వీసులు, బిపిఎం సేవల కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయనుంది క్యాప్ జెమినీ.
* క్యాప్ జెమినీ ఆసక్తి..
విశాఖ లో పెట్టుబడులు పెట్టేందుకు క్యాప్ జెమినీ( Cap Gemini ) సమ్మతించినట్లు వార్తలు వస్తున్నాయి. 1967లో ఫ్రాన్స్ కేంద్రంగా ఈ సంస్థ ప్రారంభం అయింది. ఐటీ రంగంలో కీలక స్థానాన్ని సంపాదించింది. ప్రపంచ దేశాల్లో సుమారు 3.4 లక్షల మంది ఉద్యోగులు ఆ కంపెనీలో పనిచేస్తున్నారు. అందులో రెండు లక్షల మంది ఉద్యోగులు భారత్ లోనే ఉన్నారు. స్ట్రాటజీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్, డేటా అండ్ ఏఐ, డిజిటల్ ఇంజనీరింగ్, ఎంటర్ప్రైజ్ ప్లాట్ ఫార్మ్స్, మేనేజ్డ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో క్యాప్ జెమినీ సేవలు అందిస్తోంది. మన దేశానికి సంబంధించి హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే, నోయిడా, కోల్కత్తా, గురుగ్రం, భువనేశ్వర్ సహా 13 నగరాల నుంచి క్యాప్ జెమినీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు విశాఖలో సైతం సేవలందించేందుకు సదరు సంస్థ సిద్ధపడుతుండడం విశేషం.
