TTD Laddu Issue: టీటీడీ లడ్డూ వివాదం ముదురుతోంది. జాతీయ స్థాయిలో సైతం చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వంతో పాటు టిడిపి ఆరోపణలు చేస్తున్నట్టు అసలు జంతు నూనెను కలిపారా? లేకుంటే ఇది రాజకీయ ఆరోపణ? అసలేం జరిగింది? ఎలా నిర్ధారణ అయ్యింది? దీనిపైనే ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిపుణులు మాత్రం కచ్చితంగా జంతు నూనె కలిసేందుకు అవకాశం ఉందని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీటీడీకి సరఫరా చేసి నెయ్యి నాణ్యత పై నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డిడిబి కాఫ్ తన నివేదికలు ఇచ్చింది.దీనిపై తెలుగు రాష్ట్రాల్లోని పాల ఉత్పత్తులు,ప్రముఖ ఆహార నాణ్యత,పౌష్టికాహార సంస్థలు, ల్యాబుల్లో పనిచేసిన విశేష అనుభవం గల శాస్త్రవేత్తలు కల్తీ జరిగే అవకాశం ఉన్నట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ల్యాబ్ నివేదికను పరిశీలించి కల్తీ చేశారని చెబుతున్నారు.
* 39 రకాల పరీక్షలు
గుజరాత్ కు చెందిన ఎన్డిడీపీ ల్యాబ్ నివేదికలో 39 రకాల కు సంబంధించి రసాయన పరీక్షలు చేశారు. వాటిలో పది అంశాల్లో పదార్థాలు ప్రమాణాలకు మించి ఉన్నట్లు తేలింది. నిర్దేశించిన ప్రమాణాలకు మించినా, తగ్గినా అందులో ఏదో ఒకటి కలిసినట్లేదని నిపుణులు చెబుతున్నారు. తప్పకుండా జంతు నూనెను కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
* నాణ్యత పై అనుమానాలు
వాస్తవానికి నాణ్యమైన నెయ్యిలో బుట్టిరిక్ ఆసిడ్ 1.0 నుంచి 1.5 మధ్య ఉండాలి. అయితే 0.05 మాత్రమే ఉంది. కల్తీ చేసినందుకే ప్రమాణాలు కంటే తక్కువగా వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 0.5 – 2.2 మధ్య ఉండాల్సిన కాప్రోయిక్ ఆసిడ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ మాత్రమే ఉన్నట్లు తేలింది. ఇది తగ్గడానికి కూడా కల్తీయే కారణమని తెలుస్తోంది. లారి ఆమ్లం నిర్దేశిత ప్రమాణాలకు మించి 11.71 ఉన్నట్లు వెల్లడయ్యింది. ఇవన్నీ నెయ్యి కల్తీ ని నిర్ధారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
* అక్రమాలు జరిగే అవకాశం
గుజరాత్ లోని ఎన్డిడిబి కాఫ్ ల్యాబ్ కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. అక్కడ పరీక్షల్లో తేలిన విషయాలను ప్రామాణికాలుగా తీసుకుంటారు. తాజా ఫలితాలను చూస్తే నెయ్యి నమూనాల్లో జంతు కొవ్వు కలిసిందని భావించాల్సి ఉంటుందని హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థల్లోని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పెద్ద మొత్తంలో టెండర్లు దక్కించుకున్న సంస్థలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. అయితే తిరుమల లడ్డూ తయారీకి భారీగా నెయ్యి అవసరం. అటువంటి చోట కచ్చితంగా తనిఖీ చేసే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. కానీ టీటీడీలో తనిఖీ చేసే వ్యవస్థలు ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో కంటే టీటీడీ లడ్డూలో సువాసన, రుచి తగ్గింది. దీనిని బట్టి కూడా ప్రాథమిక నిర్ధారణకు రావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అయితే టీటీడీ లడ్డులో జంతు నూనె వాడుతున్నారని శాస్త్రవేత్తలు సైతం నిర్ధారిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More