AP Panchayat elections: ఏపీలో( Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బిగ్ అప్డేట్. త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రధాన అధికారి నీలం సాహ్ని కీలక సూచనలు చేశారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. ప్రధానంగా పంచాయితీలకు సంబంధించి సర్పంచుల పదవీకాలం గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 31 తో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి గడువు ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం నిధుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. పాలకవర్గం ఉంటేనే పంచాయితీలకు ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలన్న నిబంధన ఉంది. అందుకు అనుగుణంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం అవుతోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల జాబితాల తయారీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ఈ ప్రక్రియను ముగించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు..
పరీక్షల తరువాత..
రాష్ట్రంలో ఈ ఏడాది ముందుగా ఇంటర్మీడియట్( intermediate) పరీక్షలు పూర్తి కానున్నాయి. మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అవి పూర్తయిన వెంటనే పంచాయితీ ఎన్నికల నగారా మోగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారి ఫోటో ఓటర్ జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 2026 జనవరి 1 ని అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాలు తయారు చేయాలని ఆదేశించింది. ఇలా తయారు చేసిన ఓటరు జాబితాలను మార్చి 9న అధికారికంగా ప్రచురించబోతున్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
వాయిదాకు ఛాన్స్ లే..
మరోవైపు జనగణన( census ) ప్రారంభం కానుంది. అటు తరువాత కుల గణన కూడా చేపట్టనున్నారు. ఈ రెండు రకాల ప్రక్రియతో పంచాయితీ ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యమని ప్రచారం నడిచింది. కానీ దానిని తెరదించుతూ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రక్రియ ఆగదని.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్న దృష్ట్యా.. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. మరోవైపు మార్చి 17తో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగియనుంది. ప్రత్యేక అధికారులను నియమించి.. పంచాయితీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికల నిర్వహించే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
